పుట:Kasiyatracharitr020670mbp.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెయ్యింటికి చేరుతారు. గుడి పండాలలో 1400 కి దాకా చేరుదురు. గోసాయిలు బయిరాగులు యేనూటికి చేరుతారు. వొక్క అణాపామరునికిన్ని నాలుగూణాలు పండితుడికిన్ని దక్షీణ యిస్తే ఆనందింపుచున్నారు. గొప్పవాడు యీ స్థలము విడిచిపెట్టి వచ్చేటప్పుడు గుడియిలాకాపండాలకు నూరు రూపాయలు బహుమతి రూపముగా మొత్తముగా యిస్తే వారివారి తారతమ్య ప్రకారము కలియపంచుకొని తృప్తిని పొందడము లేదు. నాపరువుకు మొన్నూరు రూపాయలు ముట్టచెప్పితే యెంత మాత్రము నా పురోహితునికి కనికరము తోచ లేదు.

వింధ్యకు ఉత్తర దేశస్థులు యెందరు ధనికులు యెందరు ప్రభువులు యే యాత్రవచ్చినా యే సత్కర్మలు చేయతలచినా తోచిన కాలమందు యీశ్వరుడు యిచ్చిన సంపత్తుకొద్ది దానాలు చేసి యత్నసిద్ధి గలవారవుతారు గాని దాక్షిణాత్యుల స్వభావము వలె నేటికి బోరిగెల కోనుకోగానే సరేనా, యెల్లప్పటికి వొక్కటేరీతిగా నడవను యోచనచేసి ఒక్కటే నిదానముగా ధర్మము చేయుచూ వుండవద్దా? అని వెర్రితనముగా యీశ్వరవేద్యము లయిన భవిష్యత్కార్యములను తమకు తెలిసినట్టు తమ అధిక జాగ్రత్తవల్ల కొన్నిపనులు నడవతగ్గట్టుగా యీశ్వరుడు కటాక్షించిన కాలమందు కూడా శక్తికొద్ది ధర్మము చేసుకోకుండా విత్తము త్యాగభోగరహిత మయ్యేటట్టు దాచి వ్యర్ధోపయోగ మయ్యేటట్టు చేయడములేదు. గనుక హిందుస్తానులోని గొప్పవారు యీ పండ్యాలవంటి యాచకులకు యిచ్చే ప్రకరణములో అతిశయమైన యీవిని యిస్తారు గనుకనున్ను దక్షిణ దేశస్థులు కొంచముయిచ్చి తియ్యనిమాటలు శానా చెప్పుతారు గనుక దక్షిణ దేశస్థులకు యేర్పడివుండే పండ్యా దాక్షిణాత్యులకు రాక్షసులని నామకరణము చేసినాడు.

ఈ స్థలముయొక్క రీతి యేమంటే గుళ్ళోవుండే బింబాలు నిరూపించకూడని స్వరూపాలతో వుండడమున్ను రెండుబింబాలు యిరు పక్కల వుండేవి యధోచితముగా సమయమయిన గాత్రముతో వుండడమున్ను మధ్యే సూక్ష్మరూపముతో ఒక బింబము స్త్రీ అని పురుషుడ