పుట:Kasiyatracharitr020670mbp.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చినది. గనుక ఆ చొప్పున లొతు కావడమువల్ల వడ్డున వుండే భూమి వూటపారి యీ శీతాకాలములో అతిశీతలమయి పయిగా జనసమ్మర్ధము విస్తారమయి నందున జ్వరాలు మొదలయిన అనేక రోగాలను ఉత్పత్తి చేయుచున్నది. మిక్కటముగా భూమి కొత్త అయినవారికి వుపద్రవము యెక్కువగా వుంచున్నది. కాశీలో ప్రవేశించిన వెనక యికను సుభిక్ష రాజ్యములో ప్రవృత్తి కలుగు చున్నదనే తాత్పర్యము చేతనున్ను కలకత్తా పర్యంతము నావల మీద పోవలెననే యిచ్చచేతనున్ను కాశెలో కొన్ని దినములు వసించవలసియున్నదనిన్ని హయిదరాబాదులో కొలువుపెట్టిన ఒక జత పండ్రెండు మంది బోయీలనున్ను, ఆరుగురు బంట్రౌతులనున్ను పట్నాంన్నుంచి వచ్చిన ఆరుగురు కావడి వాండ్లనున్ను కొలువు తీసి వేసినాను. మిగిలియున్న వారిలో నలుగురికి కుదురుతువస్తే ఆరుగురికి జ్వరాలు మొదలయిన యుపద్రవాలు తగులుతు వచ్చుచున్నవి. యిక్కడి స్థలజ్ఞులు అదేప్రకారము రోగపీడితులుగానే వున్నారు. యిక్కడి చలి మన దేశస్థులకు అసహ్యముగా నున్నది. నాపరివారానికంతా ధగళాలు, కుళ్ళాయిలు, చావళ్ళు, లుంగీలున్ను తీసియిచ్చిన్ని కుంపట్లు ఆపేక్షింపుచున్నారు. నేను ప్లానుల(ఫ్లాన్ల్)తో అన్ని వస్తువులున్ను వారివలెనే కుట్టించుకుని ధరించినాను. యెండకాలములో వుష్ణము అదెప్రకారము అతిమిక్కటముగా నుంచున్నదట. అందుకు కారణము అప్పట్లో గంగ లోపలికి పోవడము ఒకటే గాని వేరే తొచలేదు. ఇప్పట్లో ఇక్కడ అహస్సు 26 గడియలు. యీ వాశి రాత్రి వృద్ధి అయి వుంచున్నది.

కాశీక్షేత్రము సకల స్థలములలోనున్ను చేసిన పాపములను పోగొట్టుచున్నది. యీ కాశీ మహాస్థలమందు లోకులు చేసే పాపములను యావత్తున్ను పోగొట్టడానికి జ్యోతిర్లింగ ప్రదక్షిణార్ధము పంచక్రోశయాత్ర అని యొకటి చేయవలసినది. ఆ యాత్ర చేసిరావడానకు అయిదు దినములు పట్టుచున్నది. ప్రధమ దినము మణికర్ణీకలో స్నానము చేసుకొని సంకల్ప పురిసారముగా ప్రయాణమయి మొదటి దినము కద్రమేశ్వరము అనే యూళ్ళో నిలిచి అక్కడ కర్దమతీర్ధ