పుట:Kasiyatracharitr020670mbp.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెట్టుకొని సముధ్రమధ్యే తెచ్చి సముద్రోదకాన్ని పానము చేయుము, నీ క్షుత్తుతీరిన వనక వివాహము చేసుకుంటానని చెప్పెను. మంచిదని ఆద్వాసి బడబుడు అగ్ని స్వరూపముగా బడబాగ్ని యనే పేరు పెట్టుకుని సముద్రోదకాన్ని పానముచేస్తూ వున్నాడు.

యీ రీతిగా ఆ రాక్షసుణ్ణి నివృత్తి పొందించి నాకు కూడా సమాప్తి చేయను అశక్యమయిన స్తుతికి పాత్రభూతమైన యీ ప్రయాగను కండ్ల చూతామని సరస్వతి ఇక్కడికి వచ్చినది. ఆ సమాచారము గంగా యమునలకు తెలిసి సరస్వతిని ప్రార్థించి తమతో కూడా యీ స్థలమందు క్రీడింపుచు వుండవలనని చెప్పినారు. సరస్వతి ధన్యురాల నయితి నని యెంచుకొని వారి ప్రార్ధనను అంగీకరించి అయితే నేను ప్రకాశముగా మీతో క్రీడింపుచు నుంటే బ్రహ్మ యేమే సరస్వతి, ప్రయాగ మహాత్మ్య స్తుతిని సమాప్తిచేయక పోతివని నన్ను అడుగును; అప్పుడు నేను మిక్కిలి లజ్జించ వలసి యుండును; గనుక గుప్తగామినై మీతోకూడా వుంటానని, అద్యాపి క్రీడింపుచు నున్నది. వారు ముగ్గురునున్ను యీరీతిగా యిక్కడ సంగమమయి నందున త్రివేణి అనే మూడుపాయలు గల జడ అయినారు. ఈ త్రివేణి పయిన వ్రాసిన అక్షయ వటమనే వృక్షము కుచ్చుగా ప్రకాశింపు చున్నది. గంగ యమునతో సంగమ మయినది మొదలు లోకులు పాపాలను కత్రించను ఈ రెండు నదులు మంచి కత్తెర అనే ఆయుధముగా నున్నా ఆ కత్తెరకు నడుమ బిగింఛే చీల లేకున్నందున బలము తక్కువబడి యుండెను. ఈసరస్వతి గుప్తగామినిగా ఆఛీల స్థానముని పొంది వున్నందున ఈ మూడు నదులున్నూ అది మొదలుగా లోకుల పాపాలను కత్రించను శక్తిగల చురుకయిన కత్తెర అయి త్రివేణి నామమును వహించి సదరహి ముగ్గురు స్త్రీలున్ను ఇచ్చట ఒక నదీరూపమును వహించి ప్రవహింపుచున్నారు.

ఇచ్చట క్షౌరము, గోదానము, త్రివేణీదానము, తిలదానము, కించిద్దానమనే ఉపాయ దానమున్ను, ముఖ్యములని చెప్పబడియున్నవి. ధైర్యముచేత ప్రాణదానము ఇచ్చట చేస్తే వాడు జన్మాంతరమందు