పుట:Kasiyatracharitr020670mbp.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనిషికి రెండేసి పయిసాలువంతున పుచ్చుకొను చున్నారు. యీఠాణావారు పాంధులను కాపాడే వారివలె అభినయించడమే గాని వేరుగాదని తెలిసియుండ వలసినది. ఈ జగనంపల్లెలో రెండు చిన్న దేవాలయాలున్నవి. రమణియ్యమైన స్నానఘట్టము కలిగిన చెరువున్నది. అంగళ్ళు కలవు. అన్ని పదార్ధములు దొరుకును. బ్రాంహ్మణుల యిండ్లలోనే దిగి నాను. యిక్కడికి 4 మజలీల దూరములో వేములవాడ అనే మహాక్షేత్రమున్నది. అది భీమేశ్వర రాజేశ్వరక్షేత్రము. వేములవాడ భీమకవి జన్మప్రదేశము. ఈ ప్రాంతములో వ్యాఘ్రాలు పశువులను అప్పుడప్పుడు భాధింపుచున్నవి. ఆ రాత్రి జగనంపల్లెలో నిలవడమయినది.

నాల్గవ ప్రకరణము

28 తేది ఉదయమున 6 ఘంటలకు ఆ యూరువదిలి 12 ఘంటలకు అక్కడికి 6 కోసుల దూరములో నుండే దూదుగాం అనే ఊరు చేరినాను. అది గోదావరీ నదీతీరము. ఆరు భ్రాంహ్యణుల యిండ్లున్నవి. గోవదావరి కవతలి గట్టున స్వర్ణ అని చెప్పబడే భ్రాంహ్మణుల యిండ్లు గల యగ్రహారమున్నది. ఆ దినము నడిచిన భాట సరాళము, యిసకపొర, నిండా అడివి లేదు. జగనంపల్లె నుంచి యీదూదుగాముకు రెండు మూడు భాటలు కలవు. అందులో నేను వచ్చినభాట కొంచము చుట్టయినా వసతి యయునది. ఆర్మూరు అనే బస్తీ గ్రామము జగనంపల్లెకు 2 కోసుల దూరములో నున్నది. ఆయూరి మీదనొక భాట పోవుచున్నది. అది వసతి కాదు. జగనంపల్లెకు 4 కోసుల దూరములో బాలకొండ యనే గొప్పగ్రామము షహరువలెనే బస్తీగానున్నది. యేరస్తాగుండా జగనంపల్లెనుంచి వచ్చినా యీ బాలకొండ నడివీధిలో నడిచి రావలసినది. నేనువచ్చిన భాట శీదాగా బాలకొండకు మధ్య యేయూరున్ను తగలకుండా వచ్చుచున్నది. హయిదరాబాదు వదిలినది