పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హారు రూపాయిలకు పదహారుబెత్తాల గొడుగు వచ్చిందన్నాడు. నేను శ్రీ విజయనగరం మహారాజావారి దర్శనానికి వెళ్లినప్పడు ఇటీవల రచించిన పద్యాల్లో వక సీసపద్యంలో "పడవలె పడరాని పాటులెల్ల" అని వ్రాశాను. ఆపాట్లు, ఆయినా పాట్లే అని చదువరులు తెలిసికొందురుగాక. లాక్షణికులు “ఆహా భారోగురుః కవేః" అని వూరకే వ్రాయలేదు. దేశాటనం వల్ల ఎన్ని కష్టసుఖాలు వంటబడతాయో చదువరులు గుణితింతురుగాక.

క్షుధా తురాణాం నరుచిర్నపక్వం

పిమ్మట మఱునాడు జాగ్రత్తగా కోయిల్ ఘాటుకే వెళ్లి టికట్టు తెచ్చుకొని స్టీమరెక్కేము. ఆ స్టీమరు మఱునాడు ఉదయం 9 గంటలకు చాందిని వాలా అనే వోధ్ర గ్రామము వెళ్లవలసినదైనా సముద్రంలో త్రోవదప్పి రాత్రి 9 గంటలకుగాని గమ్యస్థానానికి చేరింది కాదు. చేరటంతోటే, ఏదోనది వొడ్డున దిగడం గనుక, క్రొత్తగా వచ్చిన ఆ బురదనీళ్లలో స్నానంచేసి వూల్లోకి చేరి అందరమూ వక సావిట్లో మకాం చేశాము. అది వక దుకాణదారుని యింటిసావిడి. దానినిండా రెండేసి గజాలకు వొక్కొక్కటి చొప్పున చాలా వండుకొనే పొయిలున్నాయి. పొయి వక్కంటికి అర్ధణా వంతున బాడుగ యివ్వడం యేర్పాటు. తురకా, దూదేకులు, కోమటి, బ్రాహ్మడూ, అందఱూ అక్కడే వండుకోవడం. బియ్యం పప్పూ, వగైరాలు ఆ దుకాణంలోనే కొనుక్కోవడం. ఉప్పుడు బియ్యం తప్ప దొరకవు. చింతపండు ఆ దేశస్టులు వాడరు. దానికి బదులు లేతమామిడికాయల తాలూకు యెండబెట్టిన చీలికలు దొరు