పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైన సంతోషమును కలిగించి, భవిష్యత్సందర్భమునకు మంగళ సూచకముగ కన్పట్టింది. ఆ మఱునాడు నిడమలు అనేవూరు వెళ్లాము. ఆ గ్రామము శ్రీ శనివారప్పేట" సంస్థానములోనిది. బారజల్లీ' అనే సీమలో ప్రధానగ్రామాల్లో వకటి. అక్కడ జమీందారుల ఠాణా ఆఫీసు వున్నది. ఆ సమయానికి ఆ యెస్టేటు మేనేజరు శ్రీ దుగ్గిరాల రామదాసుగారు అక్కడనే వున్నారు. మేము ముందుగా ఠాణా కచ్చేరీలోకి వెళ్లి కొంత గడబిడ కవిత్వంతో చేయ మొదలుపెట్టినాము. ఎవరేనా ఏదేనా అడిగితే, కవిత్వంతోటే మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికి, ఆ వుద్యోగస్థు లన్నారుకదా, "అయ్యా, మీరెవరో చాలా గొప్పవారుగా ఉనారు. మిమ్మల్ని మా యజమానిగారు చూస్తే వదిలిపెట్టరు. కానీ వారిప్పుడు వక కార్యంలో చిక్కుకొని యున్నారు. రాత్రిగాని వారికి లేశమున్నూ తీరిక కాదు. ఈవేళ చాలా వయస్సు గతించిన వారి యప్పగారి ద్వాదశాహస్సు. ఇది అంత విచారకరమైనది కాకున్ననూ, మీకు దర్శనం మాత్రం ఇవ్వడానికి అవకాశ ముండదు. మీరు వకటి రెండు రోజులు వుంటే తప్పక వారు మిమ్మల్ని చూచి ఆదరిస్తారని చెప్పగా, మేము ఎట్లో ఈ రాత్రే సభ జరిగే వుపాయం చేయవలసినదని పద్యాలతో ఆ ఠాణా ఆఫీసర్లను కోరితిమి. అట్లు కోరుటకు కారణమేమంటే, ఆ రోజున ఆయా గ్రామములనుండి పెక్కుమంది బ్రాహ్మణులు సంభావనకు వచ్చి యుంటారు. వారిలో నూటికి పదిమందియైనా పండితులుంటారు. వారి సమక్షంలో మనము కవిత్వం చెప్పడం మొదలెడితే అది ఆయనకు బాగా నచ్చుతుంది. అలా నచ్చినట్లయితే కాశీకి వెళ్లడానికి యావత్తు