పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

కాశీమజిలీకథలు - మూడవభాగము

అప్పుడతండు వానినొక రహస్యప్రదేశమునకు దీసికొనిపోయి రామిరెడ్డీ, మణివర్మ యెట్టి స్వభావము గలవాడు? అతని భార్య యెట్టిది? పిల్లలెందరు, ఇంటిలో నేమి చేయుచుండును. వారి యింటిలోఁ దఱచు నీవేమిపని చేయుచుందు వని అడిగిన వాడిట్లనియె.

అయ్యా! మణివర్మ మిక్కిలి కోపస్వభావుడు. ఆయనకు బిల్లలులేరు. పూర్వ మొక కూతురుండునది. ఆమె కొంతకాలము క్రిందట జనిపోయినది. ఆమెకొక పుత్రిక యున్నది దాని పేరు సుభద్ర. తల్లిచాపు పిల్ల గనుక నాచిన్నదానినిమాత్రం ప్రేమగా జూచుచుండెను. భార్యను సర్వదా దండించుచునే యుండును. ఆయనలోపలి మందిరములో నుండి శక్తిపూజ చేయుచుండును. ఆయన మనుమరాలు సుభద్ర దొడ్డిలో బుష్పవనము వైచికొన్నది ఆ పూవుతోటకు నేను నీరుతోడుచుందును. ఇదియే లోపలి వృత్తాంతమని చెప్పెను.

రాజపుత్రుడు వెండియు వానితో రామిరెడ్డి, సుభద్ర కెన్ని యేండ్లున్నవి? పెండ్లియైనదా? అని అడిగిన వాడు ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. తెలివిగలది చదువుకొన్నది. దానికి దిగిన సంబంధము రానందున ఇంకను బెండ్లిచేయలేదు. మణివర్మ యెట్టివారిని లెక్క సేయడు ఆచ్చేడియకు బదియారేడు లున్నవి ఆచిన్నదాని వివాహప్రయత్నమే యిప్పుడు సేయుచున్నారు కాని యింతలో నతనికిరోగము వచ్చినది. దానం చేసి యాగిపోయిన దనిచెవ్పగా నారుగ్మత కుదిరినదా అని అడిగిన నింకను నెమ్మది లేదని చెప్పెను.

ఆతండు తలయూచుచు గొంతసేపాలోచించి, రామిరెడ్డీ, నీవు నాకొక్క యుపకారము చేయవలయును మణివర్మ యిచ్చుదానికన్న నేను బదిమడంగు లెక్కువ యిత్తును. నేనును ధనికుడను కాని సామాన్యుడను కాను. వినుము నీతో గూడ నన్నొకసారి వారి యింటిలోనికిం గొనిపొమ్ము వీడెవ్వడని అడిగిన గూలివాడని చెప్పుము. ఏమిటికి దీసికొని వచ్చితి వందురేని నీరు తోడుట కీనాడు నాకు రుగ్మతచే శక్తిలేకున్న మానివేసినచో మొక్కలు వాడిపోవును. అందుమూలమున గూలి మాట్లాడి తీసికొని వచ్చితినని చెప్పుము. తరువాయి కృత్యము నేను సవరించు కొనియదనని చెప్పిన విని వాడు సంతసించుచు బాబు మీరు చెప్పినట్లుగా నప్పుడు డప్పుడు చేయుటయు వాడుకయున్నది. ఆలాగే చేయుదును మీరు ఱేపు జాము ప్రొద్దెక్కులోపల నిచ్చటికి వచ్చి ఉండుడు. నేనువచ్చి తీసికొని పోయెదనని చెప్పి వాడు తన యింటికిం బోయెను .

కందర్పుఁడదియు నొకఫలసూచకమే అని సంతసించుచు నప్పటి కింటికి బోయి మఱునాడుదయమున గన్నులమాత్రము గనిపించునట్లు దేహమంతయుమాసిన అంగీలు దొడిగి కూలివాని వేషము వైచుకొని యా పనివాడు చెప్పిన చోటునకుం బోయి నిలువంబడి ఉండెను.