పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హైమవతికథ

63

పతకము కానుకగా నిచ్చినది. ఇదిగో చూడుడు అని తన మూటలోనున్న హారమును జూపెను.

ఆపచ్చలపేరు చూచి జయభద్రుడు వెరగుపడుచు బరీక్షకు రప్పించి అందుగల రత్నములు వెలగట్టింప నివి నిరూపించుటకు మావశము కాదనియు నివి అమూల్యములనియుం జెప్పిరి.

పిమ్మట జయభద్రుడు ఆ బ్రాహ్మణునిం జూచి విప్రోత్తమా! నీవా సతీమణి భర్తయగు జయభద్రునిం జూచితివా? అతని పోలిక యెట్లుండునని అడిగిన అప్పాఱుండిట్లనియె.

దేవా! దేవర యేమనుకొనినను మేలగుఁగాని యా సాధ్వీమణి పతికిని మీకు నించుక తారతమ్యము లేదు. ఆతండు మీ పోలికనుండు మీ యిరువురకు నెద్దియేని బాంధవ్యము గలిగియున్నదేమో తెలియదు దేవరను జూచిన నాటవోలె నాకీ సందియము గలిగియే యున్నది, ఆసునీతి పతితోగూడ బీటలపై గూర్చుండి బ్రాహ్మణులకు దానము గావింపుచుండును. దానంజేసి మాకు ఆయనను గూడ జూడంగలిగెనని అచ్చటి విశేషము లన్నియుం జెప్పెను.

ఆ మాటలు విని జయభద్రుడు మఱియు వెరంగు పడుచు సవినయముగా నా బ్రాహ్మణుని ననిపి అంతఃపురమునకు బోయి హైమవతింజూచి మచ్చెకంటీ! వింతలు వినవచ్చుచున్నయవి మా దేశమునకు బోయి చూచి రావలయును సునీతి విఖ్యాతి నీవును వినియుంటివి కదా? అచ్చట మఱియొక జయభద్రుడు నా పోలికవాడు పీటలపై గూర్చుండునట ఆ చిత్రములు చూడ నెంతయు నౌత్సుక్యముగా నున్నవి. నేను రహస్యముగా బోయివత్తును. నీవిచ్చట భద్రముగా నుండుమని చెప్పిన నా యొప్పులకుప్పయు దానుకూడ వత్తునని యెంతేని నిర్బంధించెను గాని అతండందులకు సమ్మతింపక తానొక్కరుఁడ రహస్యముగా బయలు వెడలి కతిప్రయ ప్రయాణముల స్వగ్రామమునకు బోయెను.

పూర్వపు వేషముతో నా పట్టణవీథిలో బోవుచుండగాఁ బెక్కండ్రు వచ్చి పరిచయముతో బల్కరించుచు నేయవియో వ్యవహారములు మాటాడదొరంగిరి. కాని అవి యేమియు జయభద్రుని కర్థమైనవి కావు.

ఒకడు వచ్చి నమస్కరించి యెదుర నిలువబడి అయ్యా! తమశెలవు ప్రకారము వచ్చితిని. ఆజ్ఞ యేమి అనియు మఱియొకడు దేవా! దేవరయానతిం బోయి పండితులం దీసికొని వచ్చితిని వీరె చూడుడు, విమర్శింపక పోవుచున్నా రేమి? అనియు బల్కుచుండ వెఱుఁగుపడుచు మాటాడక నడుచుచుండ అతని వెంట బెక్కండ్రు బ్రాహ్మణులు దానార్థులై నడువ దొడంగిరి.

స్తోత్రపాఠములు పఠింపుచు నిట్లు బ్రాహ్మణులు పెక్కండ్రు చుట్టునుం బరివేష్టించిరా వారితో నేమియు మాట డక వడిగా నడిచి కోటలోనికి బోయి తల్లిదండ్రులం గాంచి నమస్కరించెను.