పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

కాశీమజిలీకథలు - మూడవభాగము

నాయొద్ద మీకిచ్చుట కేమియునులేదు. భుజించి నన్ను గృతార్దు చేయుడని యెన్నోరీతుల బ్రతిమాల దొడంగెను. కానియయ్యతి చిత్తము గఱగినది కాదు.

ఆస్వాములవా రట్టివాడు గనుకయె సొమ్మిచ్చుకొనలేక యెవ్వరును భిక్షకు బిలుచుట మానివేసిరి. ఎన్ని జెప్పినను వరహా కన్నులం జూపినగాని భుజింపనని గట్టి పట్టుపట్టును. ఆరీతినే అయ్యతి యెన్నియో వరహాలు సంపాదించి భూమిలో బాతిపెట్టుచుండెను.

అయ్యతి చేయుచున్న క్రౌర్యమును జూచి యాచిన్నది తన కుడిచేతనున్న రత్నకంకణము నూడదీసి స్వామీ! మీరొక వరహా నడిగితిరి కాని యిది వేన వేలు వెలచేయును. దీనిని దక్షణగా మీకిచ్చుచున్న దాన భుజింపుడని వేడుకొనెను.

అప్పుడు మిక్కిలి సంతోషించి యాపచ్చలకడియ మందుకొని యాసన్యాసి సంతుష్టిగా భుజించి వారిం దీవించుచు నాలయమునకు బోయెను.

హైమవతీ జయభద్రులు ఆసన్యాసి చర్యల నాశ్చర్యముగా జెప్పుకోనుచు శేషపదార్ధములు భుజించి మరల పయనమై వారుమఱియొక యూరు చేరిరి. ఈరీతి వారు గ్రమక్రమముగా నమరావతీ నగరమార్గమునంబడి పోవుచు నొకనాడు రాత్రి అమరావతి ప్రాంతమందున్న యొక గ్రామముచేరి అందొక వర్తకుని యింటి యరగుమీద బరుండిరి. అప్పుడు కొందరు వర్తకులయొక్క సంవాదమీరీతి విననయ్యె.

సుబ్బిశెట్టి -- రామశెట్టీ విశేషములు? ధరవరలెట్లున్నవి?

రామశెట్టి - సుబ్బి శెట్టిగారా! దరవరలకేమి? సునీతి పుణ్యమున బంగారమును రత్నములును చవకయైనవిగదా! బ్రాహ్మణులూరక తెచ్చి, వచ్చినవెలకే యమ్ముచున్నారు. ధరలకేమి భాగ్యము?

సుబ్బి -- ఆసునీతి, యెంతభాగ్యవంతురాలో, ఆహా! దానమిచ్చిన వస్తువులలో నున్న రత్నములు దేవతారత్నములు సుమీ ఆమె వాడుకయే కాని యామె మగని వాని వాడుకయేమియు లేదేమి?

రామ - ఆమెమగనిపేరు జయభద్రుడట. యావస్తువులన్నియు నాయనయే తెచ్చి భార్యకిచ్చుచున్న వాడట. దాన మామె చేయుచున్నది. కావున నామెపేరు వాడుకగా నున్నది. ఈలాగునని అచ్చటి నుండి వచ్చిన బ్రాహ్మణు డొకడు నాకు జెప్పెను.

సుబ్బి - అగునకు మగవాడు సంపాదించుటయే కాని పేరుప్రతిష్ట లాడుదాని మూలముననే రావలయును.

రామ - మీరావస్తువు లేమైనను గొంటిరా ?

సుబ్బి. - లేదుబాబూ సాదారణముగా వస్తువుల బరీక్షించిగాని కొనగూడదు. ఈనడుమ వీరశెట్టికి జరిగిన ప్రాయశ్చిత్తము విన్నావా ?

రామ - అదేమియో నేనెఱుఁగను చెప్పుము.

సుబ్బి - మొదట మనరాజుగారి కూఁతురు హైమవతి వివాహము సంగతి వింటివా?