పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హైమవతికథ

51

వృత్తాంతము చెప్పినవారికి గొప్ప పారితోషిక మిత్తునని యెల్ల దేశములకు దూతల పంపెను.

రామా - బాగానే జరిగినది. బ్రాహ్మణులకు సంభావన యియ్య లేదా?

అప్ప --- సంభావనమాట కేమి, యానాఁడు భోజనము లేకపోవుటయేకాక వేత్రహస్తులచేత దెబ్బలు తిననివాడెవ్వడు?

రామా - తరువాత నేమి జరిగినదో మాకుఁ దెలియదు. అచ్చటినుండి లేచి వచ్చితిమి. మేము వచ్చువరకు మంచి కలహములో నున్నారు.

రామా - ఇప్పుడెచ్చటికి పోవుచున్నారు?

అప్ప -- మణిప్రస్థమునకుఁ బోవుచున్నాను. ఆదేశపు రాజు కుంతిభోజుండు అతనికుమారుడు జయభద్రుడు, అతనిభార్య పేరు సునీతి. ఆ చిన్నది తనపేరు సార్దకముచేయుచు నిత్యము బ్రాహ్మణులకు అనేకదానములు చేయుచున్నది. ఆమెచే దానమందినవాడు మఱియొకరిని యాచింపడు. ఈనడుమ మాయూరినుండి కొందరు బ్రాహ్మణులు వెళ్ళి, పెక్కు ధనము సంపాదించుకొని వచ్చిరి.

అప్ప -- ఇదిగో ? తూర్యఘోషములు వినిపించుచున్నవి. యెచ్చటనో, వివాహము జరుగుచున్నట్లున్నది. సంభావనకు బోవుదము వచ్చెదరా ?

రామా - అలాగే వెళ్ళుదములెండు, అని పలుకుచు దోడివారలతో గూడ నిష్క్రమించుచున్నారు.

ఆ మాటలన్నియు విని హైమవతి, జయభద్రునితో ఆర్యా ! ఈబ్రాహ్మణులసంవాదము వింటిరికదా, నామూలమున మాతల్లి దండ్రుల కెట్టిచిక్కు సంప్రాప్తించినదో చూసితిరా ఆరాజు లిరువురునేకమై అతని నిర్భంధింతురేమో, కటకటా! నేనెంత దోషకారినైతిని. నాచరిత్ర మెంత కంటకమయ్యె. అయ్యయ్యో! నేను సంతోషముతో నింటికి బోవలయునని నన్ను వారు మిక్కిలి గౌరవించుచుందు రనియు దలచు కొనియుంటినే? నాతల్లిదండ్రులు తప్పక శత్రురాజుల పరాభవమునకు వగచి బలవన్మరణము నొందుదురు. ఇకనన్ను మన్నించువా రెవ్వరు అని యనేక ప్రకారముల వగచుచున్న యా చిన్నదాని నోదార్చుచుచు జయభద్రుం డిట్లనియె.

బోటి! నీవేటికి జింతింపవలయును. నేను బోయి యావైరుల భంగపఱచి మీతండ్రికి సంతోషము గలుగజేయుదును. ఊరడిల్లుము వేగముగా నమరావతికి బోవుదమని పలికి యామెనోదార్చెను.

మఱియు నాతరుణి అతనితో, ఆర్యా! మీభార్య చర్యలు నాశ్చర్యముగా చెప్పుకొనుచున్నారే! అట్లు దానము చేయుటకు నామెకు ధనమెచ్చటనున్నది. మీరే యిచ్చివచ్చితిరాయేమి? ఆహా? ఆసాధ్వి యెంత పుణ్యాత్మురాలో, ఇంతదూరములో నామె దానమహిమను, గొనియాడుచున్నవారే! అంతకన్న జన్మమున కుత్కృష్ట మేదియున్నది. అని పెక్కుగతుల నయ్యువతిని వినుతింపుచుండ నతండేమియు మాటాడక మందహాసము చేయుచుండెను.