పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హైమవతికథ

47

మ్ముల హృదయమ్ము నాటనేయ, నా పాటలగంధి చిత్తవృత్తి లెస్సగా దెలియమిఁ దెల్లముగా వెల్లడి కాకుండ దొందర పడరాదని నిశ్చయింపుచు నాయింతి కిట్లనియె.

యువతీ, యిప్పుడు మార్తాండుఁడు లలాటభాగము నాతపముచే గ్లేశము నొందింపుచున్నవాఁడు ఇది క్రూరప్రచారము గల మహారణ్యము. రాత్రివేళ నీ యరణ్యములో నుండరాదు. చీకటి పడకముందు యెద్దియేని జనపదముం జేరవలయును. పల్లవకోమలములగు నీయడుగు లీరాళ్ళ త్రాకుడునగందును. యెట్లు నడచెదవు నీవు నాభుజములపై గూర్చుండుము, మెల్లగా దీసికొనిపోయెదనని పలుకగా అక్కలికి యిట్లనియె.

ఆర్యా! దేవర విషయమై అట్టి అపరాధము చేయుటకు నేను గఠినచిత్తురాలను కాను. ఆత్మసుఖావసానము చేతనయినను, ఆర్యుని సుఖమే గోరదలచితిని. దేవయానిని యయాతివలె నూతిలోనుండి నన్నుద్దరించిన యార్యుని యుపకృతికిఁ బ్రతికృతి యొద్దియు జేయమికి లజ్జించుచున్నదాన. నేను నడువనోపుదు దేవర యడుగు లూతగాఁ గొనిన నాకేమియు శ్రమయుండదు. కష్టము గట్టెక్కినట్లు తలచుచున్నదాన పోదము లెండని పలుకగా నతండు సంతసించుచు నచ్చట దృఢముగా గనంబడిన యొకదారింబడి యామెతో గూడ నడువజొచ్చెను.

ఆ చిన్నది. మాటలు ప్రౌఢముగా, జెప్పనదిగాని నడచునప్పుడు మిక్కిలి యాయాసము జెందినది. మోముదామరకు శ్రమజలబిందుసందోహ మలంకృతియై వెలయు బయ్యెదచేనొత్తికొనుచు నెండవేడిమి సహింపక చెరంగు నాతపత్రముగాఁ బట్టుకొనుచు బొక్కు లెక్కిన పాదములు దడిమికొని యుస్పరని కూర్చుండియతం డేమియమకొనునో అని అంతలో లేచి మరల నడచుచు నెట్టకేలకు సాయంకాలము దనుక నడిచినది కాని జనపదం బేమియు గనంబడినదికాదు

రాత్రి పడినతోడనే యాచిన్నది అతనితో ఆర్యా! చీకటి పడినది. మృగముల యార్పులు వినంబడుచున్నయని మనకెట్లు తెల్ల వారునో తెలియకున్నది. ఈ రాత్రి దాటించితిమేని ఱేపటి కేదియేని గ్రామము కనఁబడక మానదు.

అని బెదరుఁ గదురఁ బలికిన నచ్చిలుకలకొలికి నోదార్చుచుఁ దరుణీ, వెరవకుము, నిన్ను నాభుజాంతరమున నిడుకొని రక్షించెదను. నీ ప్రాణముల నాయసువులనిడి కాపాడెదను. ఇందుగల సత్వముల నాభుజసత్వంబునం బారద్రోలెదనని యుదుటు గరపుచు నొకరమ్యమైన శిలాతలంబునం గూర్చిండి చేడియా! రమ్ము, రమ్ము నాతొడపై శిరమిడుకొని యథేచ్ఛముగా నిద్రబొమ్ము. నిద్రయుడిగి యీ రే యెల్ల గాపాడుచుందునని పలికెను.

అప్పు డప్పడతియు నెడదజెలంగుచు మొదట వెరపునంబోలె నతనియురము గౌగలించుకొనియెను, అతండును ఓదార్చువాడు వలె నెడమచేత నదిమిపట్టుచు మోము మోమునంజేర్పి కుడిచేతితో నధరము బుడుకుచు నూరడింపుచుండెను.

అప్పు డిరువురకు మేనులు సాత్వికభావవికారముల నొందినవి.