మాలతి కథ
293
అని యెఱింగించువఱకు వేళయతిక్రమించుటయు నాటికక్కథం జాలించి మణిసిద్ధుండు తదనంతర వృత్తాంతంబు తరువాత మజిలీయం దిట్లని చెప్పదొడంగెను.
ముప్పదవ మజిలీ
మాలతి కథ
వత్సా! వినమట్లు మాలతీలలనభోగంబులు స్వప్నోపగముల మాడ్కి యనిత్యంబులని నిరసించి కాషాయవస్త్రధారిణియయి యరుగుచు నొకనాఁడొక యరణ్యంబులో నెదురుపడినయొక బ్రాహ్మణునకు నమస్కరించుచు నయ్యా! మీరు తరచు దేశాటనము జేయువారువలె గనబడుచున్నారు. మీకెందయిన మువ్వురు వెఱ్ఱివారలు కనంబడిరాయని యడిగిన నప్పారుఁడు స్మృతినభినయించుచు నిట్లనియె.
కాంతా! ఈ ప్రాంతమందలి గ్రామములో నధికారులచే నాటంకబెట్టబడి యెవ్యరో మువ్వురుండుటమాత్రము జూచితిని. వారు మందపాల మహారాజుగారి యంతఃపురద్రోహముచేసి చెరసాలలో పెట్టబడి తప్పించుకొని పారిపోయినారట. వారిం బట్టుకొని యా గ్రామాధికారు లావార్త ఱేనికనిపినారట. వాండ్రను వెర్రివారని కొందఱును కారని కొందఱును నిరూపించుచున్నారు. నీవడిగినవారు వారేమయి యుండవచ్చును. వారు నీకేమి కావలయును? నీవిట్టి ప్రాయంబున గాషాయవస్త్రంబులం ధరించి యొంటియయి నడవుల గ్రుమ్మరుచుండనేల? నీరూపము త్రిలోకమోహనజనకమయి యున్నదే యని యడిగిన నప్పడతి యిట్లనియె.
ఆర్యా! నేనొక జోగురాలను, శిష్యురాలనగుటచే వారియవసరము కావలసి వచ్చినది. అంతకన్న మరేమియులేదని పలికి యక్కలకి యావిప్రుని ననుమతిం బడసి వడిగా నడచుచు నాటి సాయంకాలమున కాగ్రామముచేరి వారిం గలిసికొనినది. అప్పుడు వారొక చావడిలో బడవేయబడి యున్నారు. కావున నాపువ్వుబోణి వారి యవస్థకు మిక్కిలి పరితపించుచు నతిదీనములగు విలోకనములచే వారిమొగములు పరీక్షించుచు దాపున నిలువంబడియే యారాత్రి యెట్టకేల వేగించినది.
తమ్మెంత దైన్యముగా చూచినను యాచించినను యా చిగురుబోణితో వారేమియు మాటాడినవారుకారు వారిం గాచియున్న తలవరులు మరునాఁ డుదయ కాలంబున నధికారులయొద్దకుంబోయి అయ్యా! రాత్రి నాపిచ్చివాండ్రదాపున కొక తొయ్యలి వచ్చినది. ఏమి రహస్యముల మాటలాడికొనిరో తెలియదు. ఇంతదనుక నందేయున్నది. మీరువచ్చి చూడుడని చెప్పిన వారప్పు డక్కడకుఁజని యవ్వనితం గాంచి వెఱగుపడుచు పడుచా! నీ వేమిటికయి యిచ్చటికి వచ్చితివి? వీండ్రు నీ కాప్తులా ? నిజము చెప్పుమని యడిగిన నబ్ఫోటి యేమాటయుం జెప్పక తలవాల్చు కొన్నది.