దేవశర్మ అను బ్రాహ్మణుని కథ
277
నింకొకసారి యిట్లు జేసితివేనిఁ గులములో వెలివేయింతునని చెప్పెనట. ఆమాటవిని యతనిపెండ్లాము ఏమైననునరే? మేము వాని కన్నముపెట్టమని చెప్పుచున్నది. మధ్యను వరుణభట్టునకు కంఠముమీదికి వచ్చినది.
రామ - అది కామసోమయాజులు కూతురు బుచ్చివెంకి కాదా. అది ఆలాటిదే. దాని కెవ్వరిభయము లేదు.
సోము --- ఇదివరకే తగవులు పడుచుండ నీయంతా విచిత్రంగాడిని యెట్లు పోషింతురో తెలియదు.
గుణవర్మ --- అంతా విచిత్రంగాడు అనగా మొన్న నీదేవాలయములోనికి వచ్చిన బ్రాహ్మణుడా యేమి? అయ్యో ఆయనది మాణిభద్రాగ్రహారము నేనెఱుంగుదును. మంచి యన్నదాత. పాపము వెర్రియెత్తి తిరుగుచున్నాడు కాబోలు. కటకటా యెంత యవస్థ వచ్చినది మార్తాండా! నీవెఱుంగవురా మనమా వేళను భోజనమునకు వెళ్ళితిమి.
మార్తాండుడు - ఓహో! ఆయనా! ఇంటిదరిని దారిప్రక్కలున్న తోటలో నీరుచేదుచుఁ దెరువరులకు దాహములిచ్చువాడు. ఆయన భార్యయేగాదు పోతబొమ్మ లాగున నున్నది.
గుణవర్మ -- నీచిన్నతనపు మాటలు మానినావుకావుగదా నీకు భోజనము పెట్టినందులకు ఫలమిదియా? భార్యమాట యెందుకు ?
మార్తాండుడు — కాదు కాదు. ఆమె మహాపతివ్రతయనియే చెప్పుచున్నాను. మనతో మాటాడినదా? భోజనము చేయునప్పుడు మన ముఖవైనం జూచినదా? పోలిక చెప్పితిని కాని మఱియొకటికాదు అతండైన మనమందరము భోజనము పెట్టవలసినదే. అంతా విచిత్ర మనుమాట కర్థమేమి?
గుణవర్మ - అతం డంతర్ముఖుడు. ఆయన యుద్దేశ మెవరికి దెలియును?
సోమశేఖరుడు — దైవాయత్తశబ్దమున కేమి యర్ధమున్నదో దీనికి నదియే పిచ్చివాండ్రమాటల కర్థము లేమిటి?
అని యిట్లు వారు కొంతసేపు సంభాషించుకొని యరిగిరి. సభాపతి శాసనప్రకారము దేవశర్మకును ఆయూరి పౌరులు వంతులువేసికొని భోజనము పెట్టుచుండిరి. అంతకుమున్ను కొన్ని నెలల క్రిందట దైవాయత్తము దైవాయత్తమని జపముచేయుచు నేమాటయు మాటాడని యొక పురుషుఁ డాయూరు వచ్చి యుండ నా బ్రాహ్మణు లతనికి వంతులు ప్రకారము భోజనము పెట్టుచుండుటచే నదిమొద లిరువురను నొకదినమే దీసికొనిపోదొడంగిరి. దానంజేసి దేవశర్మకును దైవాయత్తమునకును పరిచయము కలిగియున్నది. కాని యొండొరులు మాటాడుకొనుటలేదు. ఆ యూరి పుడమివేల్పు లొకని దైవాయత్తముగాడనియు మఱియొకరిని నంతావిచిత్రగాడనియు పిలుచుచుందురు.
తరువాత వారిరువురు జనసంఘమున్నచోట నుండక విజనప్రదేశములరసి