254
కాశీమజిలీకథలు - మూడవభాగము
భానుడు - వీణెమీటి రప్పింపక లేకపోయినావు?
రాముడు - అనేకపాటులు పడినాను. ఆవీణెమెట్లు సవరించుటయే దెలిసినది కాదు.
భానుడు - అవీణె యేమిచేసితివి?
రాముడు - దారిలో బత్తెములేక యొక బ్రాహ్మణున కమ్మినాను. దానివలన తవ్వెడు బియ్యము వచ్చినవి.
భానుడు - అయ్యో! ఎంతపని చేసితివి. ఆ బ్రాహ్మణుడెవ్వడో జ్ఞాపకమున్నదా?
రాముడు - ఆయన యొకమార్గస్థుడు, నివాసస్థలము దెలియదు. దారిలో దారసిల్లి తవ్వెడు బియ్యమునకు దుకాణముమీద బేరము జరుగుచుండగా దాననియిచ్చి పుచ్చుకొనియె
భానుడు - నీవు వీణ తెచ్చినది చంద్రు డెఱుంగునా ?
రాముడు - ( మెల్లగా) ఎరిగినదీసికొని రానిచ్చునా? కడతేర్చితిని.
బానుడు - ఊఁ హూఁ మనమిద్దరము వీరపురుషులమే.
రాముడు -- క్షత్రియవంశంబున బుట్టినందుల కామాత్రమైన పౌరుషము చూపమా? ఇందాక నీవు చెప్పిన విషయము పరధ్యానముగా విన్నాను తిరుగాఁ జెప్పుము. విజయుని జంపియే హేమను దీసికొని వెళ్ళితివా ?
భానుడు - దెబ్బతో గెడిపతిని యేమిలాభము. ఆరండ నా మాట వినినది కాదు.
రాము - అడవిలోనికి తీసికొనిపోయి నిర్బంధింపలేక పోతివా?
భానుడు - చేయవలసిన పనియంతయు జేసితిని. చంపుతానన్నను సమ్మతించినదికాదు. చివర కొకనూతిలో బడద్రోసితిని
రాముడు - మా మంచిపని చేసితివి చచ్చినదా? బ్రతికినదా?
భానుడు - అదినాకు దెలియదు. ఇంతలో నా ప్రాంతమందలి పల్లెటూరి బ్రాహ్మణుడొకడు స్నానార్థ మచ్చటికి వచ్చెను. మరి కొందరు వెనుక వచ్చుచుండిరి. దానంజేసి పారిపోయితిని
రాముడు - మంచి ప్రాయశ్చిత్తము చేసితివి. కానిమ్ము మనమిక నింటికిబోయి నిష్కంటముగా రాజ్యము చేసికొనవచ్చును.
భానుడు - అగుంగాని నేనొక్కరుండ నింటికివచ్చిన మన తండ్రి యాక్షేపించును. దేనినయినం బెండ్లియాడి పోవలయును. నీకీ రుచిర సరిపడియున్నదిలే.
రాము - దీనికింత యాలోచనయేల? ఈ వీటిలో నీయిష్టము వచ్చిన బోటి నేరికొనుము రాత్రి యా యింటికిబోయి కన్నమువేసి యా యువతిం దీసికొనివచ్చెదను. తెల్లవారువరకు నీ దేశము దాటి పోవచ్చును.
భానుడు -- అట్లయిన రేపు పట్టణమంతయు బిచ్చగాని వేషము వైచుకొని