పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాముని కథ

253

చెప్పి యతనిమతి సంతోషపెట్ట యాదినంబున నా గ్రామంబున నివసించిరి. అని యెఱింగించి యప్పటికి వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుఁడు తదనంతర వృత్తాంతము దరువాయి మజిలీయం దిట్లని చెప్పదొడంగెను.

ఇరువదియేడవ మజిలీ

గోపా! వినుమట్లన్నదమ్ములిద్దఱు సంభాషించుకొని మరునాడుదయంబున నయ్యూరువెడలి స్వదేశగమనోన్ముఖులై యరుగుచు నొకనాడు రాత్రికి భీమవర్మ పాలించెడి విజయపురంబున కరిగిరి.

అందు విజయునిచే స్థాపింపబడిన సత్రమునకు జని యీసత్రమెవ్వరిదని సత్రాధికారినడిగిరి వారు విజయుడను మహానుభావుడి సత్రమును గట్టించెననిచెప్పిరి. ఆతం డిప్పు డెందున్నవాడనని యడిగిన వారు స్వర్గమున సుఖముగా గూర్చుండిఉన్నారని యుత్తరమిచ్చిరి.

ఆ మాటలువిని విజయుడు తమ్మునితో రహస్యముగా దానచ్చట గావించిన కృత్యములన్నియు జెప్పి నలుమూలల దిరుగుచుండ నందొకచో నొక శిలాశాసనము కనంబడినది. అందు నతిపుణ్యాత్ముండైన విజయుండను ప్రధాని యీ సత్రమును గట్టించెను. అమ్మహానుభావుం డొకప్పుడు స్వదేశమునకు బోవుచు మార్గములో నకాలమృత్యువుచేత గబళింపబడియెను. ఆచంద్రసూర్యస్థాయియై యతని పేరిందు మూలమున భూతలంబున స్థిరంబై యుండుగాక. అని యున్న యక్షరంబులం జదువుకొని భీమవర్మనృపాలునికి దనయందుగల ప్రీతివిశ్వాసములకు మిక్కిలి సంతసించుచు మఱియు నచ్చటయున్న విశేషములన్నియుం జూచుచు లోనికిబోయిరి. వారి కందొక గదిలో మందధ్వనితో నిట్టి సంభాషణ విననయ్యె.

రాముడు -- అన్నా! వారికి మన యిద్దఱియందు మొదటినుండియు నసూయయే సుమీ. నేనీ కాంతతోనుండుట యిష్టములేక యెన్నియో జెప్పెను. మనలను నమ్మి తలిదండ్రులను విడచి కష్టములకోర్చి వచ్చిన ప్రియురాలిని విడుచుట నీతి యేమో నీవు చెప్పుము. అదియునుంగాక తాను పట్టుబడి యెంతబాధపెట్టినను నిజము చెప్పినదా? అది యొక్కటి చాలదా.

భానుడు - కాదా! తన్నాశ్రయించినవా రెట్టివారయినను విడువగూడదని నీతి కూడ నున్నది. మంచిపనియే చేసితివి. యెవ్వరి ప్రీతి యెవ్వరికి దెలియును.

రాముడు - పోనీ! తాను నాకు బెండ్లి చేసెదనన్న యువతి మాత్రము మంచిదియా? తన భార్య యొద్ద పనిచేయునదియట. వారిద్దరికీ మేమిద్దరము దాసులమై యుందుమనియే వానియభిప్రాయము.

భానుడు - వాని భార్యను నీవు చూచితివా? ఏ మాత్రపు చక్కనిది?

రాముడు - ఇంతయెర్రగా బొర్రగానుండగానే సరియా యేమి? ఏమో నా కంత రుచింపలేదు. నాకు రుచిరయే బాగున్నది. అయినను నేనంత తిన్నగా జూడలేదు.