పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

234

కాశీమజిలీకథలు - మూడవభాగము

ద్యంబు గావించినది. ఆ రీతి నానాతి యాలింగమునకు షోడశోపచారపూజలం గావించినది. తరువాత నయ్యంగనలెల్ల కలిసి పికస్వరములతో హాయిగా సంగీతప్రసక్తిచే నా స్వామిని గీర్తించిరి.

అట్లు కొంతసేపు మృత్యుంజయుని వినుతించి మించిన సంతసముతో వచ్చినదారి నమ్మచ్చెకంటులెల్లరు నరిగిరి. వారరిగిన కొంచెముసేపునకు నేను వెలుపలకు వచ్చి విచ్చలవిడి యాయావరణలో గ్రుమ్మఱుచు నాకొమ్మల సోయగము, పలుకులు గానం, తలచితలచి హృదయంబున విస్మయంబు నావేశింపనయ్యారే! నాకు వింతల పై వింతలు గనంబడుచున్నవి. ఇది మహర్షుల యాశ్రమమనుకొంటిని. ఈవాల్గంటులు తెరగంటి నెలంతుకలు కావలయు, లేనిచో నీజవ్వనము నీసోయగము నీలావణ్యము నితర వనితలకుండునా? వీరు నిత్యము నిచ్చిటికి వచ్చుచుందురని తలంచెదను. కానిమ్ము మఱికొన్ని దినములు పోనిచ్చి విమర్శించెదగాక యని నిశ్చయించి కదళీఫలంబులచే నాకలి యడంచుకొనుచు నందు నివసించి యుంటిని.

సూర్యదర్శనాభావంబునం జేసి యందు పవలిది రాత్రి యిది యను భేదమించుకయు దెలియదు. ఎండకును వెన్నెలకును భిన్నమయిన తేజమొకటి సతతము నచ్చట బ్రకాశింపుచుండును.

నేను బ్రాతఃకాలమని తోచిన సమయంబున నా సరస్సులో స్నానము జేసి యమ్మహాలింగమునకు నభిషేకాదిపూజావిధానములు గావించి భక్తిపూర్వకముగా ధ్యానించుచున్న సమయంబున మునుపటిపరిమళము గొట్టుటయు నమ్మచ్చెకంటులు వచ్చుచున్నారని తలంచి సత్వరముగా లేచి మునుపటిచోటనే దాగి వారికృత్యములు చూచుచుంటిని.

ఇంతలో మునువచ్చిన చిగురుబోడు లాగుహలోనుండి వచ్చి యాతటాకములో గొంతసేపు జలక్రీడలదేలి యా మంటపము మీదికి వచ్చి యెవ్వరిపని వారు సేయందొడంగిరి. అప్పుడు శివలింగమును బూజించిన యించుబోణి నిర్మాల్యమును గుఱుతుజూచి బోటులారా? ఇటుజూడుడు. నిన్నను నామాట త్రోసివేసితిరి. నిన్నటి పూవులు మీకు జూపితినిగదా? ఇట్లు మారుటకు గారణమేమియో యూహింపుడని పలికినది.

అప్పుడు మఱియొక చిన్నది భర్తృదారిక చెప్పిన మాటలు సత్యమే. నేనుంచిన పూజాపాత్రలు మాఱి మఱియొకచోట నున్నవి. ఎవ్వరో క్రొత్తవారువచ్చుచున్నారు. విమర్శింపవలసినదే యని పలికినది. మఱియొకతె అయ్యో! నావీణ త్రిప్పబడి యున్నదేమి తంతృలిట్లు సవరించిన వారెవ్వరని నుడివినది. ఈరీతి నందరు తమ పనులు మారుటచే నేకవాక్యముగా గ్రొత్తవారెవ్వరో వచ్చినారని విశ్చయించి యందు నలుమూలలు వెదకవలయునని నిశ్చయించి కానిండు రేపు తర్కింతము, ఈ దివసంబున బ్రొద్దుబోయినదని చెప్పుకొని యా దినంబున యథాప్రకారము నా స్వామి నర్చించి యథాగతముగా వెళ్ళిరి.