26
కాశీమజిలీకథలు - మూడవభాగము
తళ్కున మెఱయఁ బదంటకంబులు ఘల్లుమని మ్రోయ జనుదెంచి భక్ష్యభోజ్యాదికము వడ్డించినది.
జయభద్రునిచిత్తమంతయు ననంగచంద్రికపైనున్నది. కావున నా పదార్థరుచి అంతగాఁ గనిపెట్టక యామె తనభార్యఅని యెరుఁగక యత్తురుణి యెవ్వతియో అనుకొనియే భుజించుచుండెను.
ఆతని మనోహరాకారాము చూచి యాచిగురుఁబోడిఁ తలయూచుచు నౌరా! ఈరాకుమారుఁ డెంత చక్కనివాడు! చూచుటకైన నోచుకొనకపోయితినిగదా. ఇన్ని దినము లూరక గడిపితినే. అయ్యో ఇప్పుడీ పసరు వీరిపై నెట్లు రాయుదును? రాచిన నేమి వికటించునో? ఊరక ప్రమాదము దెచ్చినదాన నగుదును. యోగముండిన నెప్పటికే నితనికే దయపుట్టును. ఇట్టివాఁడు మగఁడని చెప్పుకొనినం జాలదా మందు వలని గలిగిన మక్కువ యేమాత్రమునిలుచును? అని పెక్కు తెఱంగులఁ దలపోసి తుదా కాపసరు వానిపైఁ జిమ్మక దాచి యాతనికిఁ గావలసినపదార్దములు వడ్డించుచుఁ దనివిదీర వానిరూపము గన్నులారాఁజూచుచుండెను. అతండును దృటిలో భుజించి, చేయిఁగడిగికొని తోడనే బట్టలుగట్టికొని యాయనంగచంద్రిక యింటికిఁబోయేను.
పిమ్మట నాకొమ్మయు మంగళసూత్రము జల్లగనుండినం జాలునని సంతసించుచు నతనివిస్తరిలో భుజించి అత్తగారి అనుజ్ఞ పుచ్చుకొని మరలఁ దనమేడకుఁ బోయినది.
మఱియు భ్రమరిక మిక్కిలి ప్రయత్నముతో సంపాదించిన మందు వృధ చేసినందునకు జింతించునని తలంచి యాపసరు తాను మేడలోనికిఁ బోవుచు దారిలోఁ గనంబడిన యొక పుట్టకలుగులోఁ బోసి యారహస్యము దానితోఁజెప్పక తలుపువైచుకొని శయ్యపై బరుండి ఆతని రూపవిశేషములన్నియు నాచేటికకు జెప్పుచుండెను.
ఇంతలో నెవ్వరో వచ్చితలుపుగొట్టిరి. ఆచప్పుడు విని యెవ్వరని భ్రమరిక అడుగగా నేను జయభద్రుఁడని యుత్తరముజెప్పెను. ఆమాటవినిన తోడనే సంభ్రమము జెందుచు సునీతి తటాలున కుయ్యడిగ్గి తలుపుతీసినది.
అతని నంతకుఁ మోర్వమే చూచియున్నది. కావున భేద మేమియు లేమి గురుతుపట్టి పాదములు గడిగి శిరంబునఁ జల్లుకొనుచు నివాళి యిప్పించి చేయింగొని బాన్పుమీఁదఁ గూర్చుండఁబెట్టి తాంబూలమిచ్చి యుచితమర్యాదఁ గావించి యాప్రాంతమున నిలువంబడి పూసరుటి వీచుచు మెల్లన భ్రమరికతో నిట్లనియె.
చేటీ! ఆర్యపుత్రునకు నేఁటికి మనయం దనుగ్రహము గలిగినది. ఇదియుఁ మత్కృతసుకృతముగానే తలంచుచుంటిని. దైవకృపలేక యేకార్యముజరుగదు. ఓర్పు గలవారికన్నియు సమకూడును. నానోములు ఫలించినవి ఇందాక దర్శించి కన్నులు గృతార్థ నొందినవి.
ఇప్పుడు దేహమునుగూడా సాద్గుణ్యము నొందఁజేయఁగోరుచున్నదానినని