పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయుని కథ

227

కొనిపోయి మరలవచ్చి మిత్రమా! ఏమియు మాటలాడవేమి? ఆ రీతినాతి నీకు బ్రీతియేని చెప్పుము. అనుటయు నాకు లోకానుభవము లేమింజేసి వారికిట్లంటి.

మిత్రులారా : ఆజవ్వని యెవ్వతె? దానిని నేను పెండ్లియాడగూడదా దానిపోలిక బోటిమాట యేటికని అడిగినవాండ్రు అబ్బో! అబ్బిబ్పోకవతి నెన్ని ప్రయత్నములు చేసి తీసికొని వచ్చితిమనుకొంటివి: సాధారణముగా వశ్యమగునా? ఆబోటి కోటీశ్వరులకుగాని వశముగాదు నీవట్టివాడవయితేని చెప్పుము. అప్పడతితో మాటాడెదమని పలికిన విని నాయొద్దనున్న ధనమంతయు లెక్క చూచుకొని కోటికంటె నెక్కుడుగా నుండుటచే వారితో నేనానాతిం భరింపగలనని చెప్పితిని. అప్పుడు వాండ్రు ఆరొక్క మంతయు తమ చేతికిమ్మని యడిగిరి. కాని యాకాంతను నావశముచేయక యియ్యనని చెప్పితిని.

ఆమాటవిని ఆదుష్టులు నన్నొకనా డాకాంతామణి మేడమీదికి దీసికొనిపోయి యొక తల్పంబునం గూర్చుండబెట్టిరి. అంతలో నా కాంత నా చెంతకువచ్చి నా మెడలో బుష్పమాలిక వైచి నన్ను వరించితినని చెప్పినది అప్పుడు నేను సంతోషసముద్రమున మునుంగుచు నాధనమంతయు దానియధీనము చేసితిని. అది మొదలు కొన్ని దినంబులు దానితో హాయిగా వెళ్ళించితిని ఇది పగలు రాత్రి యనుభేదము నాకేమియుం తెలిసినదికాదు. ఎల్లకాల మట్లు సుఖింతుననుకొంటిని. మఱికొన్నిదినంబులు కడచినవెనుక దానితల్లి యట ముసలిది నన్ను జీరి అబ్బాయీ! నీవుపెక్కుదినములనుండి మా యింటవసియించి సుఖించుచుంటివి నీయిచ్చిన సొమ్మంతయు నీ పూవులకు తాంబూలములకు పన్నీటికి నత్తరులకు సరిపోయినది. ఇక మేమెట్లు బ్రతుకువారము. నీ యొద్ద సొమ్మేమయిన నున్న దెమ్ము. లేకున్న బొమ్ము మాపిల్ల మఱియొక వల్లభునిం జూచుకొనునని పలికిన నులికిపడి నేనయ్యో? ఇది నాభార్య కాదా? మఱియొకని నెట్లుకోరుకొనును? ఆధూర్తులు మొదట నాతోనిట్లుచెప్పలేదే? ఇంక నాయొద్ద సొమ్మెక్కడిది? సొమ్మంతయు మొదటనే యిచ్చివేసితినని పలికితిని.

అప్పుడది మేలు మేలు? మేము వేశ్యలము. మావృత్తి నీ వెఱుంగవు కాబోలు మాకు ద్రవ్యమే భర్త ఆధూర్తులు చెప్పిన దినముల కన్న నెక్కడుగా నిన్నిందుండ నిచ్చితివిు. ఇక బొమ్ము . అని నన్ను వీథిలోనికి ద్రోసి తలుపువైచుకొనినది.

వస్త్రావశేషుడైన ఆ ధూర్తులనరయుచు వీథులవెంబడిం దిరుగుచుండ నొకచోట వారు గనంబడిరి వారితో ముసలిది చేసిన కృత్యమంతయు నెఱంగించిన నవ్వుచు మేమేమి చేయుదుమని నామాట వినిపించుకొనక యెక్కడికో పోయిరి అప్పుడు నేను మిక్కిలి దుఃఖించుచు నింటికిబోయిన నందఱును బరిహసింతురని వెఱచికూడుగుడ్డలకు మొగమువాచి యిట్లు తిరుగుచున్నవాడ. మొన్నటిదినము మీయూరు వచ్చితిని. ఇదియే నా వృత్తాంతమని చెప్పెను.

అప్పుడా విజయుడు తమ్మునియవస్థకు మిక్కిలి పరితపించుచు నూత్నాంబ