216
కాశీమజిలీకథలు - మూడవభాగము
శ్రీరస్తు
శుభమస్తు ఆవిఘ్నమస్తు
కాశీమజిలీకథలు
మూడవ భాగము
ఇరువదియాఱవ మజిలీ
అందు మణిసిద్ధుండు జపము చేసికొనుచుండగా వింతలంజూడబోయిన గొల్లవాడు వడిగావచ్చి యాయనంజూచి స్వామీ! మీ జపము వేగము కానిండు. మంచి వింతజూచి వచ్చితిని. దాని వృత్తాంతము చెప్పవలయునని తొందరబెట్టుటయు నెట్టకేలకు జపము ముగించి యతం డేమిరా? ఎన్నిసారులు చెప్పినను నీకు దెలియకున్నది. జపాంతరమున నంతరాయము సేయవద్దని చెప్పలేదా? నేమి మునింగినది. చెప్పుమని యడిగెను.
అప్పుడు వాడించుక గొంకుచు స్వామీ ఈ యూరిలో చెఱువుగట్టునొద్ద రెండి నుపకంబము లున్నవి నేనచ్చోటికి బోయి వింతలం జూచుచుండ బ్రాయములో నున్న చిన్నవాండ్ర చిత్రపటముల రెంటిని దీసికొనివచ్చి యా స్తంభములకుం గట్టి రాజభటులు కశలం తీసికొని దెబ్బలంగొట్టిరి. మఱియొక యాడుదాని విగ్రహము నచ్చటనే నిలువంబెట్టి పదువురు మొగముమీద నుమిసిరి. ఇంతలో మఱికొందరు వచ్చి వారికొరకు చింతించుచు వానికట్టుల విప్పించి తీసికొనిపోయిరి. వాని వృత్తాంతమేమియో చెప్పవలయు. నిందులకే మిమ్ము దొందరబెట్టితినని పలుకగా విని భుజించిన వెనుక నంతయుం జెప్పెదనని వాని నొప్పించి భోజనానంతరమున మణివిశేషము వలన నా వృత్తాంతమంతయు దెలిసికొని యా కథ యిట్లని చెప్పం దొడంగెను.
వీరప్రతాపుని కథ
సిందుబా యను నగరంబున వీరప్రతాపుండను రాజు కలడు. అతడు మొదట బద్మిని యను కాంతం బెండ్లియాడి యామెయందు సంతానము గానక క్రమంబున సంతానకారణంజేసి కమలిని కుముదిని మాలిని యనువారలం బెండ్లి యాడి వారివలనను సంతానము పొందడయ్యెను.
అతడు దక్షిణనాయకుడగుట నందఱును సమభావంబునం జూచుచుండెను. కోటలో నలువురకు నాలుగు దెసల దివ్యసౌధంబులం గట్టించి యనల్ప వస్తుపూర్ణములు గావించి నియంతకాలంబున వారియొద్దకు బోవువాడు. మణిభూషాంబరమాలికాదులలో నొక భార్య కేది యిచ్చిన దక్కువారికిగూడ నట్టిదే యిచ్చువాడు. ఈ రీతి