214
కాశీమజిలీకథలు - మూడవభాగము
కడుచిత్రమిదియ" అని తానును జదివెను తాను రచియించిన చరణములే వారు చదువుట విని తెరమాటుననున్న మందారవల్లి యుల్లంబు రంజిల్ల దదీయమతి ప్రౌఢిమకు సంతసించుచు నావిషయమే ప్రియంవదతో ముచ్చటింపుచు గాలవ్యవధి సైపక యప్పుడే తెరవెలువడి యొకపుష్పమాలికంగైకొని రామలింగకవి మెడలోవైచి నమస్కరించుచు ఆర్యా! పూర్వము భోజరాజు తన సమస్యను బూర్తిజేసినవారికి నక్షరలక్ష లిచ్చువాడట. నేనీమాలిక నర్పించితి నిది మదీయహృదయానుబంధముగా నెంచుకొనుడని పలికి యొకప్రక్క నిలువంబడినది. అంతలో బ్రియంవదయు నొకమాలికం గైకొని సుభద్రుని మెడలోవైచి యిది యంత్యచరణము బూర్తిజేసినందులకుగానుక యని పలికి యక్కవివెనుక నిలువంబడినది.
అప్పుడు రామలింగకవి మంత్రితో అనఘా! ఈ కలకంఠుల కంఠధ్వని విని నెక్కడనో పరిచయము గలిగినట్లున్నది. మంగమణియు బ్రియంవదయు ననువారు కదుగదా! వారు మాకు జేసిన మేలెన్నటికిని మరువదగినది కాదని పలికిన మందారవల్లి నవ్వుచు నిట్లనియె. అగునగు మీయెత్తిపొడుపుమాటల కర్థము కాకమానదు. వాండ్రు మాతో నంతయుజెప్పిరి. పేదపాఱులమని పేరులు మార్చుకొని దానము లందుటకై తమపజ్జల గూర్చుండబెట్టుకొని కపటదాంపత్యక్రియల నెఱపితిరట. ఎంతయుచితముగానున్నది. వారు మీరేనా? భళిభళీ! ఆయాడువాండ్ర నేమిచేసివచ్చితిరి అంతటితో మీ పేదరికము వాసినదిగద యని పలికిన విని సుభద్రుం డిట్లనియె యువతీ! యభిక్య గప్పినవారని యాక్షేపించుచుండ నేమనదగినది. పేదరికము వాయుట కంతముండునా? బిచ్చమెత్తువారు గ్రామమున కొక వేషమువైతురు. దానం బరిహసింపగూడదని పలికినవిని ప్రియంవద యెద్దియో యుత్తరమిచ్చినది. దానికి రామలింగకవి సమాధానము చెప్పెను ఆ మాటకు మందారవల్లి పూర్వపక్షము చూపెను. దానిని రామలింగకవి ఖండించెను. ఈరీతి యుక్తిప్రయుక్తులపయి వారికి బెద్దతడవు వాదముజరిగినది ఆ వాదములో రామలింగకవి మాటయే పై మిగిలి యుండెను. అప్పుడు విజయవర్మ మిక్కిలి సంతసించుచు రామలింగకవిని గౌరవించి మందారవల్లి వృత్తాంతమంతయు నా మూలచూడముగా వక్కాణించి యిది మదీయపుత్రిక, జాతిస్మృతిలేక పెక్కుచిక్కులంబడినది నిర్దుష్టరాలని నీవు యెఱుంగుదువు . దీని భార్యగా స్వీకరింపుము. బ్రాహ్మణులకు క్షత్రియకన్యకలం బరిగ్రహించుట యాచారమున్నదని వేడికొనియెను. రామలింగకవి యెద్దియో ధ్యానించిన ట్లభినయంచుచు నగుంగాని యాబోటి మొదట బత్రికలో వ్రాసినమాటలు జ్ఞాపకమున్నవియా? వాని కర్థమేమి యనిన నది యేమియు మాకు దెలియదు. నీవు నిగ్రహానుగ్రహసమర్థుడవు నీవు సమ్మతించినంజాలు పాదుషాగారిచే నారాజునకు వ్రాయించి మీ వివాహమునకు రప్పించెదనని చెప్పిన నెట్టకేల కొడబడెను అంతలో నాకాంత లిరువురు నేకాంతగృహంబునకుం బోయిరి
అమ్మఱునాడు విజయవర్మ మోహనచంద్రుని యొద్దకుంబోయి యాకథయం