పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

200

కాశీమజిలీకథలు - మూడవభాగము

యయ్యెఱుకసానిముందు గూర్చుండబెట్టి పొగ వేయించితిని అది యాధూమ మాఘ్రాణించినతోడనే పూసగ్రుచ్చినట్లుగా మా హృదయాభిలాష వాక్రుచ్చినది.

మా రాజపుత్రి గర్భవతియగుట నిజమనివిని మిక్కిలి సంతసించుచు నేను దాని కమూల్యాభరణంబు లొసంగ మేడపయి కేగితిని. అట్టిసమయంబున చిన్ని యెఱుకత తల్లితో అమ్మా! రోలంబసాని మనలంజూచి రమ్మన్న తానిదియేనా? అని యడుగగా మాటలాడకుమని తల్లి పలికినదట వారాడికొనిన భాష కల్పవల్లి చదివి యున్నది. గావున వాండ్రు కానుకలందివోయిన వెనుక నావిషయము నాతో ముచ్చటించినది.

అప్పుడు నేను వెనుకటి దినంబున జరిగిన కధ జెప్పి యిది రోలంబచేసిన కైతవముగా వచ్చునని పరితపించుచున్న సమయంబున మకరందుడు వచ్చుటయు నతనికా వృత్తాంతమంతయు జెప్పితిని. నా మాటవిని యతడు తలగంపిచుచు నగు నగు నమ్మగువ మీరాక వినియున్నదని తలంచెద. నన్ను జురచురం జూచుచున్నది. కానిండు? దీన మీ కేమిగొదవ. ఊరినుండివచ్చి యంతయు సవరించెద. అంతదనుక సైరించి యుండుడని పలికిన నులికిపడి కల్పవల్లి యిట్లనియె.

అయ్యో? మీ రెక్కడికేగెదరు? మీతోడన మమ్ము దీసికొనిపొండు. మీరులేక మేమిందుండువారమా! యని పలికిన నతడు సుందరీ! గుశద్వీపంబున కొందరు రాజులు కలహించి చివరకు సంధిజేసికొని యిరుతెగలవారును మా తండ్రి చెప్పిన చొప్పున వినునట్లొడంబడికలు వ్రాసికొనిరట. ఆ తగవుతీర్చుటకయి మా తండ్రి నన్ను గూడ రమ్మనుచున్నవాడు. పోవకతీరదు. ఆతండుండ మీ రెటులవత్తురు? వేగమేవత్తు. నాలుగుదినంబుల నెటులో గడుపుడని సాంతనపూర్వకముగా బలికి మమ్మొప్పించి యతఁడరిగెను.

మకరందుడరిగిన కొన్ని దినంబులకు సాయంకాలమున రోలంబ కొందరు బరిచారికల వెంటబెట్టుకొని మేమున్న యుద్యానవనంబునకు వచ్చినది. ఆమె రాకవిని నేను కల్పవల్లి నొకగదిలోనుంచి తాళమువయిచి యా దాపుననే పూలదండలు గుచ్చుచుంటిని. అంతలో నారోలంబ యా వనవిశేషములు జూచుదానివలె తిరిగితిరిగి మా యొద్దకువచ్చి యిందులో నెవ్వరుండిరని యడిగినది. అప్పుడు నేనులేచి యెదుర నిలువంబడి నమస్కరించితిని. మా ఇరువురకు నిట్లు సంవాదము జరిగినది.

రోలం - ఎవతెవు? ఏయూరు?

నేను - మాది జంబూద్వీపముననున్న కాశీపట్టణము. నేనొక వర్తకురాలను నా పేరు నాగమణి యందురు.

రోలం -- ఈదేశ మేమిటికి వచ్చితివి?

నేను - వర్తకము నిమిత్తము -

రోలం -- ఏమివర్తకము చేయుదువు?