పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

కాశీమజిలీకథలు - మూడవభాగము

అప్పుడు నే ననుకంపముతో గ్రుచ్చియెత్తి తత్సమయోచితములయిన మాటలచే నారాజపుత్రి మనస్సంతాపము వాయజేసితిని. మే మట్లు మాట్లాడుకొనుచుండ తెల్లవారినది. ఎటుజూచినను సముద్రమేకాని మరేమియు గనంబడలేదు అతివేగముగా నాయోడ నడచుచుండెను కొంచెము ప్రొద్దెక్కినతోడనే కొందరు పరిచారకలు మేమున్నగదిలో నాహారపదార్థములు దెచ్చియుంచిరి. నేనా చిన్నదానికి వేడుక గలుగజేయు మాటలజెప్పుచు నాహారము భుజియింపజేసితిని నేనును గుడిచిన పిమ్మట నమ్మదవతి నాతో దనపయనమును గుఱించినమాటలే చెప్పుచు నారాజకుమారునియొద్దకు బోయి తదీయచిత్తవృత్తి యెట్టిదో యరసిరమ్మని చెప్పినది.

నేనును సమయమరసి పరిచారకులచే నారాక తెలియజేసి యాయనయొద్ద కరిగితిని. అతండు న న్నుచితమర్యాదలచే సంతోషపరచెను. నేనును నమస్కరించుచు వినయవిశ్వాసములు తెల్ల మగునట్లు అతనితో జెప్పవలసిన మాటలన్నియు జెప్పి యతని నొప్పించితిని. అతని వాగ్ధోరణిబట్టి మిక్కిలి రసికుడని తోచినది. అంత నతని యనుజ్ఞవడసి రాజపుత్రియొద్దకు వచ్చి మచ్చికతో దద్వృత్తాంతమంతయు జెప్పి యామెకును సంతోషము గలుగజేసితిని. వారిరువురి చిత్తంబులును నువ్విళ్ళూరుచుండ నింతలో సూర్యాస్తమయమైనది. అంతకు పూర్వమే యందులో నొకగది యలంకరించి యుంచిరి. రాజపుత్రికను విచిత్రమయిన యలంకారములచే మోహినీదేవతలె మెలయజేసితిని. ఆచిన్నదానియందము జూడజూడ నాకే వింతయైనది అనుకూలవాల్లభ్యంబు లభింపజేసినందులకు జతురాననుని మెచ్చుకొని యమ్మచ్చెకంటి చేయిపట్టుకొని యతండున్న గదిలోనికి దీసికొనిపోయి యతని పజ్జ సజ్జం గూర్చుండబెట్టితిని. అప్పు డప్పడంతి కెక్కడనుండి వచ్చినదో సిగ్గు దిగ్గున మంచము దిగి యొకమూలకు బోయినది. నే నాక్షేపించుచు బలాత్కారముగా బట్టి తీసికొనిరమ్మని యాయనతో జెప్పి యట్లు చేయించితిని పెక్కులేల? వారిరువురచేతను నూత్నవినోదకృత్యంబు లన్నియు జేయించి సిబ్బితవాయజేసి తలుపుబిగియించి యేగితిని అదియు నాకొక వినోద కాలక్షేపమని సంతోషించుచు నారాత్రి నిద్రపోయితిని.

అంత సూర్యోదయము కాకమున్నవచ్చి యచ్చిగురుబోడి నాప్రక్కలోఁ బరుండియున్నది ఎంత ప్రౌఢులయినను చేడియలకు నూతనపతి సంగమము లజ్జాహేతువుగదా, అంతఁ బ్రాతకాలంబున నేనాయింతితో రాత్రివిశేషము లేమియని వినోదముగా నడిగిన నించుక నవ్వుచు నా జవ్వని యీ క్రింది శ్లోకము చదివినది.

శ్లో॥ కా తేకల్పముపాగతే విగళితా నీవీన్వయం తత్ క్షణాత్
     తద్వాసశ్ల ధమేఖలా గుణధృతం కించినితంబే స్థితం
     ఏతావత్సఖీ వేద్మి కేవలమహం తస్యాంగనంగే పునః
     కో సౌ కాస్మిరతంచ కిం కధమితి స్వల్పావిమేనస్మతిః॥