పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

196

కాశీమజిలీకథలు - మూడవభాగము

శ్లో. సౌధేసుధాకిరణచుంబిని లంబమాన
    ముక్తావితానవతి మంచతలే శయానః!
    ఆరోప్యపక్షసిమమానిశ మంగనేత్వా!
    మజ్ఞాత రాత్రిదినభేద మహంనసేయం.

అ॥ ఉన్నతమైన మేడయందు ముత్తెపుజాలరులతో నొప్పుచున్న తల్పంబున నిన్ను వక్షమున నిడుకొని యిది రాత్రి యిది పగలు అనుభేదము తెలియకుండ గాలక్షేపము జేయుదును.

అను శ్లోకమును దిలకించి మేను బులకింప దత్తరముజెందుచు బ్రత్యుత్తర మేమి వ్రాయవలయునో తెలియక కొంతసేపు ధ్యానించి సాహసించి యొక ఉత్తర మిట్లు వ్రాసితిని. ఆర్యా! భవదీయ కులశీలదేశనామంబు లెట్టివో తెలియక రూపైకపక్షపాతియగు మన్మథునిచేత వివశత్వంబు నొందింపబడితిని. అది యట్లుండె. శుద్ధాంతసంచారిణినగు నేనెట్లు మీ వాంఛితం బీడేర్చుదాననని చింతింపుచుంటిని. సిగ్గువిడిచి వెఱపుబాపుకొని యపవాదము సహించి బంధుప్రీతి దిగనాడి కులపరిపాటి నీటబుచ్చి స్వేచ్ఛావిహారంబున నభీష్టంబు దీర్చుకొందమన్నను సాగుట యెట్లో తెలియకున్నది. ఇంతకును సర్వజ్ఞులైన మీరెఱుంగని విశేషములుండవు ప్రత్యుత్తరమున కెదురుచూచుచున్న దాననని వ్రాసి వెండియు నాపత్రిక పుష్పగుచ్ఛమున నిమిడ్చి క్రిందికి దిగవిడిచితిని.

మఱికొంతసేపటికి దానికి బ్రత్యుత్తర మాపావురమే తీసికొనివచ్చినది. ఆ పత్రికయం దిట్లున్నది. నేను సింహళద్వీప ప్రభువగు సింహకేతుఁడను రాజకుమారుండ నాపేరు మకరందుడందురు నేనీదేశము జూచుటకై పదిదినముల క్రిందట వచ్చితిని. తిరుగా నాలుగుదినములలో మాదీవికి బోవుదును. నీకభీష్టమేని వెంటగొనిపోయి యభీష్టంబుల దీర్చుదును దీనికి జింతింపవలసిన పనిలేదు. క్షత్రియులకు గాంధర్వవివాహము శాస్త్రసమ్మతమని చెప్పుదురు. నీవు శుద్దాంతసంచారిణివయినను నిగళసాధనంబున కార్యంబు సాధింపవచ్చును. ఆప్తబంధువుల విడనాడుమని వ్రాయుటకు జేయాడుకున్నది. నీయభీష్టమెట్లు నేనట్లు వర్తించువాడ రేపటి శుక్రవారము ప్రయాణము తప్పదు.

అనియున్న యుత్తరము పలుమారు చదివికొని యందుల కియ్యకొంటినని యప్పుడే యుత్తరము వ్రాసి యాపావురము నోటబెట్టితిని. ఆహా ! నా స్వాంతమున నెట్టి సాహసము పుట్టినదియో చూడుము. యౌవనము పిశాచావేశము వంటిదిసుమీ! అట్టి యుత్తరము వ్రాసి బంధువుల దలంచుకొని తద్వియోగ మగుట విమర్శించి గుండె ఝల్లుమన నేమియుందోచక తొట్రుపడుచున్న సమయంబున నా ప్రాణసఖురాలు రామామణి నాయొద్దకువచ్చి నాదైన్యమడిగినది.

నేనును దానితో గొంతసేపు యథార్ధము చెప్పుటకు సందియమందితినిగాని