22
కాశీమజిలీకథలు - మూడవభాగము
పైపైన జూచిపోవుచున్నవాడవు కావున నీకేమియుం దెలియదు. కానిమ్ము ఎట్లయినను నేనీరాత్రి అచ్చటికి రాకమాననని యెన్నియో శపధములుచేసి ఆతని నంపెను. అనంగచంద్రికయు వారి మాటలను వినుటకు మాటుగా నొకబోటిని నియోగించినది కావున దత్సంభాషణవిషయములన్నియు దానికి బోధపడినవి.
జయభద్రుండును యా చిత్రఫలకమును హస్తమున బూని లోపలికింబోయి యాబోగముదానికిం జూపుచు యింతీ! యిందున్న సుందరి యెంత సొగసుగానున్నదియో చూచితివా. నీ బుద్ధిచాతుర్యము జూచెదను దీనంగల దోషములు నిరూపింపుము ఈలాటి బోటి భార్యగాగలవాని అదృష్టము మంచిదగునో కాదో చెప్పుము. అని యత్యంతసంతోషముతో నడిగిన విని యజ్జవ్వని అది ఆతనిభార్య యాకారమని గ్రహించి రూపవిశేషమునకు విస్మయము చెందుచు, నిట్టి కాంతగలసిన వెనుక తన్ను మరల జేరడని నిశ్చయించి దాని కొకయంతరాయము కల్పించవలయునని తలంచుచు నాపటమును పలుమారు త్రిప్పి చూచుచు శోధించుదానివలె నభినయించుచు నతండు పరాకునున్న సమయములో నాయాకృతి యెడమకంటిలోని గ్రుడ్డున దెల్ల మచ్చనంటించి యాశ్చర్యముఖముతో వితర్కించుచు రాజపుత్రా! యిటు చూడుము ఈ చిన్నది మిగుల జక్కనిదే కాని యెడమకంటిలో మచ్చయొకటి దీనికి గళంకము దెచ్చి పెట్టినది. మొగమునకు నేత్రములేకదా అందము దెచ్చునవి అట్టి అందములేని సౌందర్య మేపాటిది యీ యొంటికంటి వాల్గంటి నెవ్వనికో కప్పిపుచ్చి పెండ్లిచేయ వలయుంగాని పేరుగలవాడు దీనిని గైకొనడు. ఈ మచ్చయు నిదానంగ చూచినం గాని దెలియబడదు అని సాపేక్షముగా బలికిన నులికిపడుచు అతండా పటమును మరల గైకొని చూచి నంత నామచ్చ కనంబడినది.
ఓహో! యిది యేమి చోద్యము. యింతకు మున్ను మాకీమచ్చ గనంబడ లేదే. యిప్పు డెట్లు వచ్చినది. మేలుమేలు తొందరగా జూచితిమా యేమి? అని యాలోచించుచుండగా నా యతివ రాజపుత్రా! మీనేత్రములు పెద్దవి కనపక మీకు గనంబడినదికాదు మా కన్నులు చిన్నవి కావున గాన్పించినది. యిదియే కారణము. ఈ చిన్నది గ్రుడ్డిదికాకున్న జక్కనిదే! యిస్సిరో! యీమాత్రము దానికే అబ్బురముగా జీరితిరని పరిహాసము చేసినది.
అప్పు డతండు సిగ్గుపడుచు, అకటా! నన్ను నా మిత్రుడెంత ద్రోహము చేసెను. వానిమాట నమ్మి , విమర్శింపకపోవుటచే నిట్టికాంత తటస్థితించినది. అయ్యో! మాయన్నదమ్ములలో నన్ను గ్రుడ్డిదాని మగడని పిలుతురుకాబోలు. ఈ అపఖ్యాతి నాకెట్లు పోవును హా! దైవమాయని ధ్యానించుచు, గానిమ్ము దాని మొగమిదివఱకు నేనుచూచి యెఱుంగనుగదా! యింకను జూడను, లోకములో గ్రుడ్డివాండ్రెందరు లేరు. వారిలో నదియొకతె యిదియే దానికి బ్రాయశ్చిత్తము. నే నీ అనంగచంద్రికతో నైకమత్యముగా నుంటినని యీసుబూని, సుమిత్రు డీపని కావించెను కానిమ్ము యింతకన్న నేమిచేయగలడు. ఎట్టివారిని నమ్మగూడదని వ్రాసినశుక్రనీతి యథార్థ