పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

కాశీమజిలీకథలు - మూడవభాగము

పూర్వకాలంబున నాంజనేయ భగవానులువారు లంకాపట్టణము తగులబెట్టినపుడు గృహమునుండి వెలువడి వీధులబడి రాక్షసులు అమ్మో బాబో కొడుకో అని యీలాగుననే భయంకరముగా విలపించిరిసుమా? ఇదియే ప్రత్యక్షపురాణము.

అని యిట్లు తన్ను బరిహసింపుచున్న రామలింగకవింజూచి అతికోపముతో దుష్టవర్మ లేచి కొట్టబోయెను కాని అతనిచుట్టునున్న జన్నిగట్టులు బిట్టదల్చుటచే దరికి రాశక్యమైనదికాదు.

ఆయుపద్రవము వారించుటకు గ్రామస్తులందఱు నచ్చటజేరిరి. వారితో దుష్టవర్మ రామలింగకవిచేసిన అపరాధము నిరూపించి చెప్పి యతనిం బట్టుకొన దనకు సహాయము రమ్మని కోరుకొనియెను. కాని వారిలో బ్రాహ్మణబృంద మెక్కుడుగా నుండుటచే తమకట్టిపని చేయుటకుం గష్టమనియెంచి పౌరులు సామముగా రామలింగకవిని బిలిచి అట్టిపని యేమిటికి జేసితివని అడిగిరి.

అప్పుడతండు అయ్యా! నేనీపని అతని అనుమతిమీదనే చేసితినికాని మఱియొకటికాదు. యుద్ధపంచకము చదువుమనియు నెన్నడో జరిగిన విషయ మిప్పుడు జరుగుచున్నట్లు చెప్పుమనియు నొకపురాణము చదువుచు వేరొక పురాణార్థము చెప్పుమనియు నిన్నియు నతనిముఖమునుండి చెప్పినమాటలు. కావలసిన నీబ్రాహ్మణుల నడుగవచ్చుననియు దనవలన నించుకంతయు నేరములేదనియుం జెప్పెను.

ఆమాటలువిని దుష్టవర్మ పళ్ళు పటపటకొరుకుచు దురాత్మ! అద్భుతపురాణము జెప్పెదననిన నెద్దియో యనుకొంటిని. భారతభాగవతరామాయణార్ధములు మార్చుమనిన నిదియా? ఇట్టిపురాణము లడవివాండ్రయొద్ద జెప్పుము. ఆంజనేయులు దక్షిణగోగ్రహణము చేయుచున్న సుశర్మను కర్ణుడు రావణుని దృష్టద్యుమ్నుడు బృహస్పతిని సుగ్రీవుండు కంసుని కొట్టెనట. ఎంత అసందర్భముగానుండునో చూడుడు. అది యట్లుండె. నాజుట్టుకోసి తన్నుచు భవనములు గాల్చెను, దీనికతండు చెప్పినమాటలు మీకు నుచితముగా నున్నవని తోచేనేయని యడిగిన బౌరులు నవ్వుచు రామలింగకవి మొగముచూచిరి.

అప్పుడతండు కన్నులెఱ్ఱచేయుచు నుచితము కానివారల కుచితములుగా దోచవు. నేనుజెప్పిన యర్ధము లెవ్వరుకాదన్నను జుట్టుకోసిపంపెదను. బ్రాహ్మణు లెల్లరు క్రిందగూర్చుండి పురాణము జెప్పుచుండ బెద్దయెద్దులాగున గద్దియం గూర్చుండి శంకలువేయుట యనుకొంటివి కాబోలు. మాపురాణము లట్టివికావు. దుష్టవర్మచ్చేదకములని యెరుంగుము. నాయపరాధము నిరూపించుట కిచ్చటివారి కధికారము లేదు. కావలసిన ఢిల్లీచక్రవర్తియొద్దకు రమ్ము. ఆయన చెప్పినట్లు చేయువాడనని తనకుగల యధికారపత్రికల జూపెను.

పౌరులు దానింజూచి యేమియుం బలుకలేక ఆతని ననన్యసామన్యునిగా దలంచి గడువేర్పరచి యప్పటికి ఢిల్లీకి వచ్చునట్లుగా ఆతనిచే వ్రాయించి దుష్టవర్మ కిప్పించిరి. బ్రాహ్మణులెల్లరు తమవంత నేటితో నంతము నొందినదని సంత