పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174

కాశీమజిలీకథలు - మూడవభాగము

సు౼ గీ. తివిరి గురుకృతవర్మాది ధృతివిలసిత
         విగ్రహస్ఫూర్తిఁ గడుమించి విజయ సత్స
         హాయతాలోలుడై వచ్చు నలఘుమన్యు
         దశముఖుని భీము నర్కనందనుండు దాకె.

రామ౼ద్రోణాచార్య కృతవర్మాదియోధులు అర్జునుండును సహాయము చేయుచుండ మిక్కిలి కోపముతో యుద్దమొనర్చు దశముఖుని అనగా రావణాసురుని అతని ప్రక్కనున్న భీమునిన్ని అర్కనందనుండు అనగా కర్ణుడు దాకెన్ జావగొట్టెను అనగా రావణాసురుండు పాండవులను యుద్దమునకు సహాయము బిలువగా శ్రీరాముడు కర్ణునింగోరెనని చెప్పుకొనవలయును. అట్టికర్ణుడే రావణునిగొట్టెను. ఇది రామాయణములో భారతార్దము.

దుష్ట - ఇది యేమి యర్థము? ఇది యేమి పురాణము, రావణాసురు డేనాటివాడు పాండవు లేనాటివారు బాగుయున్నది.

రామ - అయ్యా! తమరు మా పురాణమంతయు విని తరువాత శంకను చేయవలయు నడుమ నేమియు నడుగవలదు. ఊరక వినుచుండుడు.

దుష్ట - అలాగునా? చదువుడు.

సుభ ......

క. ఈగతి దక్షిణదిశయం, దాగోగ్రహ దుష్టచేష్టు నదిపప్రమదై
     కాగారికు నిర్దాముని, గాగర్వమడంచి విడిచె గాడ్పుకొడు గొగిన్.

భారతార్థము. ఈ ప్రకారముగా గర్ణుడు తన తమ్ముడయిన భీముని గొట్టుట చూచి కోపించి గాడ్పుకొడుకు అనగా ఆంజనేయులవా రొక్కగంతులో బోయి దక్షిణగోగ్రహణము చేయుచున్న సుశర్మను రెండు గ్రుద్దులు గ్రుద్ది యిది ఆధ్యాహారము నిర్థామునిగా అనగా వాలావాగ్నిచే అతని యిల్లు తగులబెట్టి ఇల్లులేనివానిగ జేసి గర్వము పోగొట్టిన వాడాయెను.

దుష్ట - ఆంజనేయులు కొట్టుట యెట్లు?

రామ - మీ రిప్పుడేమియు మాట్లాడవలదని చెప్పలేదా అంతయువినిన తరువాత శంకలు చేయవచ్చును. భారతములో రామాయణార్థ మిదియే సుభద్రా! చదువుము.

సుభ -

క. గురుఁ డమలయోగనిష్టం, దిరమై యుండంగజూచి దృష్టద్యుమ్నుం
     డరదము మీదికురికి త, చ్ఛిరోజములు పట్టుకొని యసిం దునుముటయున్.

రామ - అట్టిసమయమున గురుడు అనగా బ్రహస్పతిగారు శుక్రాచార్యుల వారితో గూడావచ్చి రావణాసురునికి నీతిచెప్పగా వినకపోయినప్పుడు తనరథము మీదగూర్చుండి ధ్యానించుచుండగా నాంజనేయులవారు తమకు సహాయము చేసినందులకు బదులుగా దృష్టద్యుమ్నుండు వడిగావచ్చి కత్తిదూసి ఆతని వెండ్రుకలు పట్టుకుని తునిమినవాడాయెను.