పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168

కాశీమజిలీకథలు - మూడవభాగము

ములు తేలువరకు మనయాస్తి ముద్రవేయించుదురట. మనము సామాన్యవేషముతో బోవలయును. కాని యీ జంఝాటముతో వీలులేదు.

మంజువాణి - అయ్యో! అట్లయిన మనలం జూచువారెవ్వవ్వరు? మా వస్తువాహనములను ముట్టనీయరా యేమి?

మందా - మీ మా వివక్ష వారికేమి తెలియును అందు పూచికపుల్ల యేవిఁ దీసికొననీయరట. పోవుటకు బండియొకటియు నన్నవస్త్రములకు దగినంత విత్త మిత్తురట.

మంజువాణి — మనకు మంచిదశయే వచ్చినదే. ఎవ్వరికిని గాలము సమముగా నడువదు. జయజయధ్వనులతో బరిచారకులు చుట్టునుం బరివేష్టించిరా నాందోళికమెక్కి అరుగు నీవిప్పుడొక బండిపయి బేదముత్తయిదువవలె నరుగవలయును హా! యెంతకష్టము.

మందా - కానిండు. దానికేమి పూర్వులలో బేరుపొందినవారు పడిన యిడుమ లెవ్వరుపడిరి. వారికన్న మన మెక్కుడువారమా ఇప్పుడు మీరందఱు నాతోవత్తురా ?

మంజువాణి - నాకు మఱేమియు నభ్యంతరము లేదుకాని మాతల్లి పెద్దది. యింటియొద్ద నున్నది. ఒకసారి చూచి మిమ్ములను ఢిల్లీ లో గలిసికొనియెదను.

మందా - హేమలతా! నీవో?

హేమలత - మంజువాణితో నింటికిబోయి మావారిం జూచివచ్చెద, నాకును సెలవిప్పింపుము.

మందా - భ్రమరవేణి యేమనుచున్నది.

భ్రమరవేణి - అమ్మా నేను వెనుకటి మజిలీలోనే సెలవడిగితిని. మఱచి పోతివా?

మందా - విద్యుత్ప్రభకును పనియున్నదా?

విద్యుత్ప్రభ - దేవీ! నాకిప్పుడే ఇంటియొద్దనుంచి యుత్తరము వచ్చినది. ఒక జమీందారుడు నాకు కన్నెరికము చేయునట. పోక యేమిచేయుదునో అని చెప్పినది.

మందా - ఔరా! కాలము మంచిది. వసంతసేనా! నీవేమీ అనెదవు?

వసంతసేన - ఇంతీ! కుంతలేశ్వరుని కుమారుని వశములో నేనున్నదానని నీ వెఱుంగుదువుగదా. అతడు సంగీతప్రియుడగుటచే గొఱుతవడిన సంగీతము నీవలన నేర్చుకొనిరమ్మని నన్ను నియమించిన నీ శిష్యరికమునకు వచ్చితిని. నీ కృపచే నది పూర్తిఅయినది. నేను వచ్చినది మొదలు మద్విరహవేదనచే గుందుచు నతడు వార్తలనంపుచునే యున్నవాడు, రాయలవారి యాస్థానకవుల ప్రసంగములు వినిపోవలయునని యింతదనుక నాగితిని. ఇక పోవకున్న మాటదక్కదు. పరాధీననుగాకున్న నీకన్న ముందుగా ఢిల్లీకి బయనము గాకుందునా?