166
కాశీమజిలీకథలు - మూడవభాగము
యున్నది. అని మధ్యస్థులు చెప్పగా మందారవల్లి అందులకు సమ్మతించినదికాదు.
అప్పుడు ప్రధానమంత్రి లేచి పూఁబోడీ! నీవు కోరిన న్యాయవాదులు నీ వోడినట్లు చెప్పుచున్నారు సభ్యులకట్లే తోచినది. ఇంక పదినిమిషములలో బ్రసంగమునకు బూనుకొనవేని, నీ వోడిపోయిన ట్లెంచబడుదువు. తరువాత బత్రికలో వ్రాసినప్రకారము జరిగింపబడునని చెప్పి యూరకుండెను.
అప్పుడు మందారవల్లి తల్లడించుచు గద్గదకంఠముతో మహారాజా! అష్టదిక్పతులవంశమున జనించి ధర్మపాలనముగాంచు మీరి ట్లన్యాయమునకు బూనుకొన రక్షించువారెవ్వరు? నాకు బ్రతివాదులుగా నుండి మీరే తీరుపు విధించుట యుచితమా న్యాయవాదులు మాత్రము మీవారుకారా! మనతగవు మఱియొకరాజు నొద్దకు బంపవలయు ఆయన చెప్పినట్లు వినుట కర్జము అట్లుగాక బలవంతముగా ద్రోయింతుమనిన నేమిసేయుదాననని దైన్యముతో వేడుకొనిన విని అప్పుడమిఱేడు చిఱునగవుతో నిట్లనియె.
బోటీ! నీమాటకు మేమంగీకరించితిమి. ఈ గ్రంథమంతయు వ్రాతమూలముగా మనకు జక్రవర్తిగానున్న ఫాదుషాగారియొద్ద కనిపెదము నీవు ఢిల్లీకిబోయి వాదించుకొనుము. మేమును దగినవారిం బంపెదము. అంతదనుక నీయాస్తియంతయు మాస్వాధీనములో నుంచికొందుము. అందు జయాపజయంబులు దేలిన యట్లుగా నాచరింపబడునని అప్పుడే అట్టి యాజ్ఞాపత్రిక వ్రాయించి యిచ్చెను.
అప్పుడు సభ్యులందఱు పెద్దయెలుంగున లవిత్రను బ్రశంసించిరి అంతటితో సభముగిసినది. లవిత్ర యాందోళిక మెక్కి శిష్యవర్గముతో గూడ విజయనాదములతో నింటికిం జనియె. వారివెంటనే రాయలవారు పండితులతో రామలింగకవి యింటికిబోయి ఆతడున్న తావు తెలిసికొని లోపలికి జని బండితమండలితో నతని పాదంబులం బడియెను.
రామలింగకవి వారినందర మన్నించుచు నుచితాసనంబులం గూర్చుండజేసి యాత్మాపచారమును తెలియంజేయుచు నందఱు తన యింటికిం దయచేసిన కారణ మేమని యెఱుగ నట్లడిగెను.
అప్పుడా నృపతి ఆతని గౌగిలించుకొనుచు కవీంద్రా! ఇంకను మమ్ము నేమిటికి వేపెదవు నీవు లవిత్రమువలె మందారవల్లిం ద్రెంపితివి నీచేసిన యుపకృతి యెన్నటికి మఱవదగినదికాదు. సంస్థానము ఖ్యాతినిలిపితివి. ఆ పండితులు వారు గావించిన కాపట్యము మఱువవలయునని నిన్ను బ్రార్ధింపవచ్చిరి. మాఅపరాధములు మరచిపోవలయును నీవురాక మందారవల్లిని బరమేశ్వరు డోడింపలేడు. దేవీకటాక్షపాత్రుండవు. నీకు నసాధ్యమేమియున్నదని పెద్దతడ వతని వినుతించెను.
రామలింగకవియును దత్కాలోచితములయిన మాటలచే రాయలవారికిని బండితులకు లజ్జాసంతోషములం గలుగజేసెను. అప్పు డప్పుడమిఱేడు ఆర్యా! పండితకంటకురాలగు మందారవల్లి నిందు బరిభవించితివి. కొదవకార్యముకూడ