పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

కాశీమజిలీకథలు - మూడవభాగము

పరిశీలించి యుంచవలయును. శాస్త్రముల నావృత్తిగా జూడవలయును.

అని యొండొరు లాలోచించుకొని అందరు నిష్క్రమించిరి.

అమ్మరునాడు సాయంకాలమున రామలింగకవికి ప్రాణమ్మిత్రుండు సుభద్రుం డనువాడు రహస్యవిశేషములన్నియు విని చెప్పుటకు నంతకుమున్ను నియమింపబడి యున్నవాడు కావున తత్సభావిశేషములన్నియు చూచివచ్చి అతనికిట్లని చెప్ప దొడంగె.

మందారవల్లి కథ

కవీంద్రా! ఈదినంబున రెండుగంటలకు చిత్రశాలలో సభ జరిగినది. రాయలవారు మిక్కిలి సంతసముతో మనదిగ్గజములను భద్రగజంబుపై నెక్కించుకొని మంగళధ్వనులతో నూరేగించుచు చిత్రశాలకరిగిరి పౌరులు, రాయలవారు పండితులకుఁజేయు నపూర్వగౌరవంబునకు వెఱగుపడజొచ్చిరి. ఆసభయందు రెండుపంక్తులుగా బీఠము లమర్పబడి యున్నవి. వానిలో నొకదెసనున్న ముఖ్యాసనంబుల మన పండితులు గూర్చుండిరి. వారిదాపుననే రాజుగారు మంత్రసామంత్ర్యాది ప్రధానవర్గములతో నివసించిరి. ఆసభావిశేషముల నరయుటకై పెక్కుదేశములవారు వచ్చిరి. అందఱును నిశ్శబ్దముగా గూర్చుండబెట్టుటకు తగుభటులను నియోగించిరి. ఎందఱు గూర్చుండినను పుష్పకమువలె జోటుకలిగియుండుటంబట్టి సభ్యులకు సభావిశేషము లాలోకించుట కవకాశము కలిగియున్నది. రెండవశ్రేణి పీఠములనంటి యొక పట్టుతెర వేయబడియున్నది.

అట్టి సభ అంతయు నిండియున్న సమయంబున మందారవల్లి పల్లకీనెక్కి శిష్యురాండ్రుచుట్టును జయజయధ్వనుల గావింపుచుండ రెండవసరస్వతివలెనొప్పుచు మంగళధ్వనులతో నాయాస్థానమున కరుదెంచినది. అట్టిసమయమున సభాసదుల దృష్టిప్రసారములన్నియు నొక్కసారి అక్కలికిమిన్న దెస వ్యాపించినవి. రాయలవారు మిక్కిలి అబ్బురపాటుతో నచ్చోటి వైభవంబు జూడందొడంగిరి అప్పుడా సుందరి సపరివారముగా నాతెరలోనికిం బోయినది.

దానిరాక చూచినంత మనపండితుల స్వాంతంబులు విభ్రాంతి నొందినట్లు యెల్లరకు దెల్లముకావచ్చినది. మఱికొంతసేపునకు నాతెఱలో గంటమ్రోగినది. ఆనాదముతోడనే సమానవిద్యారూపవయస్కలగు జవరాండ్రు నూఱుగురు గానసాధనముల ధరియించి మనోహరములగు గీతముల బాడుచు విచిత్రగమనంబులతో నాతెర వెలుపటికివచ్చి శ్రేణిగా నిలువంబడి సభ్యులకు మ్రొక్కుచు దమ యుపాధ్యాయిని అగు మందారవల్లి విద్యావిజయప్రచారములఁ దెలుపు గీతములను పద్యములను జదివిరి.

అట్లు గొంతసేపు స్తుతిపాఠములం బఠియించి యాతెఱవలు తెరలోనికిం