పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

కాశీమజిలీకథలు - మూడవభాగము

చితివి. నీ కంటె వీరు తక్కువవారా? రెండు వ్యాకరణపు ముక్కలు చదువుకొని యెగిరెగిరి పడుచున్నావు. స్వరయుక్తముగా సంధ్యావందనము చెప్పుచూతము.

పేరిశాస్త్రి --- అర్థము తెలియని మీ పాటవలన ప్రయోజనము లేదని రూఢిగా జెప్పుచున్నాను. ఊకదంపు, ఊరుకో నీతో మాటాడుటలేదు మాటకుమూడు తొస్సెలు వస్తవి.

జగన్నా - ఊ ఆలాగునేమి? కాని సభజేసి ఈ సంగతి తేలుస్తానుండు.

పేరిశాస్త్రి - నీ సదుగునకు సభలుకూడాను.

లక్ష్మణకవి - శాస్త్రులుగారూ! మీకు వీరితోనేమి? మీ అభిప్రాయమేమో చెప్పండి. పద్దులో ఎప్పుడు వ్రాస్తేనేమి యిప్పించేవాడను నేను మీకేమి దానము కావలయును.

పేరిశాస్త్రి - నేను వీరిలాగున చిల్లరదానములేమియు బట్టను ఇదివరకు జేయిచాపినవాడను కాను మాజ్ఞాతికుఱ్ఱవాని నొకనిగాటుకవేసి యీ రత్నావతిమూడు పుట్లభూమి యేకఖండిక లాగినది. మాకు చేలోచేను ఆ భూమి యిప్పించండి ఇక మరేమిన్ని నాకక్కరలేదు.

జగన్నాధావధాని - పడుపులంజ కాళ్ళు గడగియిస్తే పుచ్చుకొనుటకు సిద్ధముగానుండి తక్కిన వాళ్ళనందరిని అధములని యాక్షేపించెదవేల? నీ యెక్కువ యేమిమండినది? కంబళిలో తింటూ వెండ్రుకలు లెక్క పెట్టెన న్నట్లున్నది. వీరు మాత్రము తిలదానములు పుచ్చుకొనుటకు వచ్చినారనుకొంటివా యేమి? ఇస్తే అందరికి భూదానమందే యాస యున్నది.

పేరిశాస్త్రి - నీవు శుద్ధఛాందసుడవు నీతో నేను మాటాడను.

లక్ష్మణకవి - అవధానులగారూ! ఊరుకోండి పెద్దన్నగారు! తరువాయి శాస్త్రజ్ఞులను చెప్పెండి.

పెద్దన్న - లెక్కించి యిరువదిముగ్గురు వ్రాయండి.

లక్ష్మణ - అందఱిపేరుల వ్రాసినాను. తరువాత ?

సర్వశాస్త్రి -అయితే లఘుకౌముది చదివెనోలేదో శాస్త్రులని పేరుపెట్టుకొని తిరిగే యీవెంగన్నగాడి తరువాత నాపేరు? భావ్యముగా జేసిన ముండాకొడుకును గదా, పరువుమర్యాదలు చూడ వద్దా వీరి తండ్రి యిప్పటికి నీరుకాసులు పట్టుచున్నాడే.

వెంకన్నశాస్త్రి - ఏమీ నేను వెంగన్నగాడినైతే నీవు సర్విగాడవు కావూ. నాకు లఘుకౌముదియైనను రాదేమి నాతో సమానంగా పంక్తినన్వయించు పరశ్లోక మన్వయముకాదు. శాస్త్రజ్ఞులని విఱ్ఱవీగుచుందురు చూచుచుండగా నూరుపద్యములు చెప్పగలను. నీకు పదిరోజులు గడువిస్తాను ఒక్క పద్యము చెప్పు చూతాము.