పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(13)

మనోరమ కథ

105

ఆతనివృత్తాంతమును విని మనోరమ పర్యంకము దిగ్గ నుఱికి సిగ్గున దూరముగాబోయి రత్నకవాటము మాటున నిలిచినది. అప్పుడు మథురిక, సఖీ, దాగెద వేమిటికి! ఆయనగుట్టువెట్టుక తన వృత్తాంతమంతయుం జెప్పెనుకదా? చేసినకృత్యముల నెట్టుగా భావింతువు ఇప్పుడు చేయదగిన దేమి అని అడిగిన నవ్వనిత బోటీ! నన్నడిగెదవేమిటికి? చేసిననేరము నొప్పుకొనిన పిమ్మట జేయదగిన పనియెద్దియో అదియే కృత్యమని పలికినది. తప్పుచేసినవారిం గాపాడుటయు సాధుధర్మమైయున్న దని యారాజకుమారుడు ప్రత్యుత్తరమిచ్చెను. ఇది కాపాడెడు నేరము కాదని యప్పైదలి తిరుగ బలికినది. అప్పుడు మథురిక రాజపుత్రీ ! నేనొక్కటిచెప్పెద నాకర్ణింపుము. ఎవ్వడేపనిచే నపరాధి అగుచున్నాడో, తిరుగా వానికట్టిపని చేయుటయే శిక్షఅని నాకుదోచినది దీనికిరువురు సన్ముతింపవలసినదే. కావున నీవిటువచ్చి నిన్నితండేమిచేసెనో నీతని కట్లుచేయుము. అని పలుకుచు బలాత్కారముగ లాగి కొనివచ్చి అతని వక్షమునందును గపోలములయందును గందము బూయించినది. పిమ్మట నేమిచేసె జెప్పుమనిఅడుగుచు నగునగు జ్ఞాపకమువచ్చినది. నీయుంగరమున ముద్రలు వేయుము. గిల్లుము అని యీరీతి జెప్పుచు నాయాయీపనులు చేయించి రాజపుత్రా ! నీవుమాత్ర మూరకుందువా యేమి, ప్రతిగావింపుమని కనుసన్న జేసి అవ్వలికేగినది. పిమ్మట వారిరువురు మన్మథుం గృతార్థు గావింపుచు పలసి యేకశయ్యాగతులై ప్రొద్దెక్కుదనుక నిద్రించుచుండిరి.

అప్పు డేమియుందోచక యాచేటిక రాజపుత్రిక యస్వస్థతగా నున్నది. కావున నీదినంబున సఖురాండ్రందఱు దూరముగా నుండవలయునని అందఱకుజెప్పి అట్లు కావించినది. ఆవార్త విని మనోరమతల్లి యుల్లంబున దల్లడిల్లుచు బుత్రికను విమర్శింప నచ్చటికి వచ్చినది.

ఆమెరాకంజూచి మధురిక వెఱచుచు ముందుగానే లోపలకుబోయి రాజపుత్రికనులేపి యాకధజెప్పినది. అదరిపడుచు నమ్మనవతి అతని లేపకయే తాను మంచముదిగి గుమ్మముదాపునకు దల్లి కెదురుగాబోయెను. రాజపత్ని పుత్రిక వైకల్యరూపముచూచి శంకించుకొనుచు నీయొడలిలోని యస్వస్థత యెట్టిదని అడిగిన దత్సమయోచితముగా జెప్పి అప్పడతి అప్పుడే తల్లిని సాగనంపినది. తరువాత నతని లేపి రహస్యముగా జలకమాడించి మధురాహారముల సంతృప్తి గావించిరి.

అదిమొద లతండు ప్రతిదినము వేకువజామునబోయి పగలంతయు నాపట్టణములో మొదటసత్కరించిన బ్రాహ్మణుని యింటవసించుచు రాత్రియైనతోడనే అమ్మనోరమ మేడకు బోవుచు నీరీతినారుమాసములు కేళిపారావారవీచికల దేలియాడెను.

అంతలో నాకాంత గర్భవతియైనది. ఆవార్త క్రమక్రమముగా నంతఃపురమంతము వ్యాపించినది. పిమ్మట రాజపత్నికి దెలిసినది. తరువాత వీరసేనునికి నెవ్వరో పేరులేని పత్రికాముఖంబున దెలియజేసిరి. ఆకథ వినినది మొదలారాజు నిద్రపోవక అన్నా? స్త్రీలకంటె దుర్మార్గులీలోకములో లేరు.