హెడ్- వేమన్న - తమతాతా, గురూ?
బైరా- అవును - వారు పరంపదించి ఆరువొందల సంవత్సరాలు కావొచ్చింది.
హెడ్- తమవయస్సెంత గురూ?
బైరాగి- ఆదీ అంతూలేనిదానికి లెఖ్ఖేవిఁటి తమ్ముడా? పరమాత్మకెన్నేళ్లో అన్నేళ్లు.
మునస- యేం యిలవైన మాటలింటున్నాం!
(వీరేశ శంఖం పూరించును.)
హెడ్ - (శంఖంలాక్కొని పక్కనువుంచి) అట్టె పట్టెయ్యకండి భాయి.
దుకా - అట్టే యక్కడభాయీ? పరవశవైఁందాకా తాక్కుంటే తాగడవేఁటి? వేమన్న చెప్పలేదా?
"తాగి, తాగి, తాగి, ధరణిపైబడుదాక ।
తాగెనేని తన్ను, తాను తెలియు ॥
తాగలేనివాడె, తాగుబోతరయంగ ।
యిశ్వదాభిరామ యినరవేమ" ॥
బైరాగి- కాశీలో రెండువందల యాబై సంవత్సరములక్రిందట ఆలంగీర్ పాదుషావారి హయాంలో, ఒకశేటు మాబోటి సిద్ధులనందరిని కూటానికి పిలిచాడు. గంగనడివిఁని పడవమీద పీపాలలో సారాయి భరాయించి, బంగారపుగిన్నెలతో అందిచ్చాడు. రెండుఝాములరాత్రి అయేసరికి పీపాలు కాలీ అయిపోయినాయి. అంతా పడిపోయినారు.
హెడ్- యేమి ఆశ్చర్యం!
బైరా- మేమూఁ ఒక్క నేపాళపు బ్రాహ్మడూ మిగిలాం. "తే! తే!" అన్నాడు ఆ బ్రాహ్మడు. "తెస్తావా శపించేదా" అన్నాడు. శెట్టి యెక్కడ తెస్తాడూ? వాడు మాకాళ్లు పట్టుకునేటప్పటికి పర్వాలేదు నిలవమని చెప్పి, మేము ఒక పుణిక మంత్రించి, గంగ భరాయించినకొద్దీ ఆగంగ సారా అయిపోయింది. ఆ బ్రాహ్మడు సహస్ర పుణికలుతాగి జిఱ్ఱునతేన్చాడు. బ్రాహ్మల్లోకూడా మహాత్ములుంటారు. కనుక్కో గలిగిన జ్ఞానికి గంగానది అంతా సారాయి కాదా?
మునస- రామందాసొహడు, గంగ బరాయించడానికి గురువు; ఒకదరావుఁకి పద్ద రావుఁలు సేరుస్తాడు.
(హవల్దారు అచ్చన్న ప్రవేశించును.)
దుకా- గురూ వీరు హవల్దార్ అచ్చన్నగారు. మంచిగ్యాని. మునసబుగారికి మేనల్లుడు.
హవ- రామ్! రామ్!
బైరాగి- రామ్! రామ్!
హవ- (యోగినితో) పిల్లా హుక్కాలావ్. (హెడ్తో) భాయీ గుంటూరు శాస్తుల్లుగారి పత్తాయేమైనా తెలిశిందా?