పుట:Jyothishya shastramu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. ఎవడు జ్యోతిష్యుడు?

ఏ మనిషికైనా జరిగిపోయిన కాలము, జరుగుచున్న కాలము, జరుగబోవు కాలము అని మూడు కాలములు కలవు. జరిగిపోయిన కాలమును ‘భూతకాలము’ అంటున్నాము. జరుగుచున్న కాలమును ‘వర్తమానకాలము’ అంటున్నాము. జరుగబోవు కాలమును ‘భవిష్యత్‌ కాలము’ అంటున్నాము. జరిగి పోయిన భూతకాలమును మనలోని మనస్సు యొక్క జ్ఞాపకము చేత తెలుసుకోవచ్చును. దానినే మనోనేత్రము చేత భూత కాలమును తెలుసుకోవచ్చునని పెద్దలన్నారు. ఒకని భూతకాలమును మరియొకడు తెలుసుకొనుటకు వీలులేదు. ఎవని భూతకాలమును వాడు మాత్రము వాని మనస్సు చేతనే తెలుసుకోవాలి. జరుగుచున్న వర్తమాన కాలము అందరి కళ్ళముందర ప్రత్యక్షముగ జరుగుచున్నది. కావున ఎవరి కన్నుల ద్వార వాడు తెలుసుకోగల్గుచున్నారు. వర్తమానకాలమును అందరూ సులభముగా తెలుసుకొంటున్నారు. జరిగిపోయిన భూతకాలమును మనో బలహీనత కల్గినవారు మరచిపోవచ్చును. భూతకాలమును వాని మనస్సు జ్ఞప్తి తేలేకపోతే, దానిని తెలుసుకొను అవకాశము లేకుండ పోవచ్చును. కానీ వర్తమాన కాలమును ఎంత తెలివి తక్కువ వాడుగానీ, మనో బలహీనత కలవాడుగానీ తెలుసుకొనుటకు అవకాశము గలదు.

జరుగబోవు భవిష్యత్‌ కాలమును తెలుసుకొనుటకు, అంతరంగము లోని మనోనేత్రముగానీ, బాహ్యరంగములోని ప్రత్యక్ష నేత్రముగానీ పనికి రాదు. భవిష్యత్‌ కాలమును తెలియుటకు జ్ఞాననేత్రము కావలెను. జ్ఞానజ్యోతి వలన తెలియునది కావున దానిని ‘జ్యోతిష్యము’ అంటున్నాము. దీనిని బట్టి జ్ఞాననేత్రమను జ్యోతిష్యము ద్వారానే, భవిష్యత్తు కాలమును తెలియవచ్చును. మనిషికిగల భూత,వర్తమాన,భవిష్యత్‌ అను మూడు కాలములను మూడు నేత్రముల ద్వార చూడవచ్చునని తెలియుచున్నది.