పుట:Jeevasastra Samgrahamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భూమిమీద మొదటినుండియు నిప్పుడు కానవచ్చెడి వివిధ ఆకారములును వివిధ నిర్మాణములును గల జీవులన్నియు లేవు. మొట్టమొదట అవయవ రహిత మైనమూలపదార్థముండెను. తరువాత వికారిణి వంటి యేకకణప్రాణులు పుట్టెను. ఇవి మిక్కిలిమోటువాడును నగ్నముగా నరణ్యమునందు సంఘములేక యేకాకిగా దిరుగువాడును అగు నడవిమనుష్యునివంటివి. ఇట్టి మనుష్యుడు తనకు గావలయుపనులన్నియు దానే చేసికొనును. భక్ష్యమును సంపాదించుకొనుట, దానిని తినుటకు దగినదానిగా వంటజేసికొనుట, ఇల్లుకట్టుకొనుట, తననుశత్రువునుండి రక్షించుకొనుట మొదలయినపనులన్నియు నెవనికి వాడే చేసికొనుచుండును. అది జంతువర్గములోని వికారిణియొక్క స్థితియు నిట్టిదియే. హెచ్చు తరగతి జంతువులలో స్నాయువులుచేయు శారీరిక సంకోచ వికాసములును, మజ్జా జ్ఞానతంతువులచే గలుగు స్వేచ్ఛాచలనము బాహ్యపదార్థ జ్ఞానము మొదలయిన వన్నియు ఈ యేకకణమే చేయును అని చదువరులు మూలగ్రంథముయొక్క మొదటి ప్రకరణమువలన దెలిసికొన గలరు. ఈ జీవకణమునుండి ద్విఖండవిధానమువలన ననేకకణములు పుట్టుచుండును. ఇందు గొన్ని యొక్క చోట గలసియుండి కొంచెము పైజాతిజీవు లగును. పైన జెప్పిన అరణ్యమానవుని కంటె గొంచెము హెచ్చుతరగతి మానవులు ఒక చోట గలసి యుందురు. వీరు ఎవరిపనులు వారే చేసికొనుచుందురు. ఒక్కచోట కలసి యుందురని యే గాని సంఘ నేమములుగాని, కట్టుబాటులు గాని వారికుండవు. ఎవరికి వారు స్వతంత్రులు. కోయ, చెంచు, ఎఱుకు మొదలయిన యరణ్య జాతు లిట్టివి. జీవసృష్టిలో వీరికి, బోల్చదగినజీవు లనేకములు కలవు. నిలచియున్న నీళ్లలో గానవచ్చెడి పసిరికపోగులు మొదలయిన నిట్టివి. వాని నిర్మాణములో ననేకకణములు కానవచ్చును. అవియన్నియు గలసియున్నను, అందు ప్రతికణమును స్వతంత్రముగా దన భక్ష్యసంపాదనము, ఉదర, భరణము, సంతానవృద్ధి మొదలయినవి చేయుచుండును. జంతువులలో ప్రదాళ కీటకములు (పగడపు పురుగులు) ఇట్టివి. ఒక ప్రకాండమునకు సెట్టు లనేక కొమ్మ లంటుకొని యుండునో యటులనే మధ్య ప్రవాళమున కీ కీటకములన్నియు ----