పుట:Jeevasastra Samgrahamu.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన మిదివరకు జదివిన వారిపర్ణి, నాచు మొదలగు వృక్షజాతి జీవులయందువలె హైడ్రాయందలికణములు, ఎడతెగనిరాశిగా నమర్పబడియుండక, దాని శరీర మధ్యముననుండు జీర్ణాశయ మనబడు నొక బిలముచుట్టును.. ఆ బిలమునకు శాఖలుగా నుండు మీసపుపోగుల బిలములచుట్టును, కణములవరుసలు అమర్పబడియుండును (27-వ పటములో C-చూడుము). ఈ బిలముల యొక్క గోడయే దాని శరీరావరణపుగోడ. అది యన్ని చోట్లను రెండు కణములవరుసలచే జేయబడినది. అందు వెలుపలివరుసకు బహిశ్చర్మము (Ectoderm) అని పేరు. (బ). లోపలివరుసకు అంతశ్చర్మము (Endoderm) అని పేరు (అం). ఈ అంతశ్చర్మకణములే జీర్ణాశయమునకు సరిహద్దుకణములు. ఈ రెండు కణములవరుసలకు నడుమ పొడుగున నొకపొర గలదు. దీనికి నడిమిపొరయని పేరు (న.పొ). ఇది యాకణములనుండి స్రవించిన యొకానొక జిగటపదార్థముచే జేయబడినదిగాని కణములవరుస గాదు. ఇది మిక్కిలి స్థితిస్థాపకత్వము గలది. అనగా రబ్బరువలె సాగునది. ఇట్టిపొర యుండుట చేతనే, హైడ్రా తన సంకుచితరూపమును విడుచుతోడనే పొడవైనరూపమునకు తటాలున నిగుడుచుండును. ఆవర్తకారియొక్క వెలుపలి పొరయు నిట్టిదే యని చదువరులు గ్రహింపనగు.

బహిశ్చర్మకణములు.

బహిశ్చర్మమునందు రెండువిధములైన కణములు గలవు. అందు ముఖ్యమైనవియు, స్పష్టముగ తెలియునవియు నగు పెద్ద