పుట:Jeevasastra Samgrahamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సృష్టియందు గానవచ్చెడి పదార్థముల గుణధర్మములను దెలిపెడి భౌతికశాస్త్రములకు బ్రత్యాక్షానుభవమే సర్వాధారము. ఓమము తినిన గడుపులో నొప్పి యాగును అని యనుభవమువలననే తెలిసికొనిరి. ఇది వైద్యశాస్త్రములోని యొక చిన్న విషయము. అనేక సంవత్సరముల వఱకును నాకాశములోని చంద్రునివైపు చూచి మానవులు శుక్రచంద్రాది గ్రహోపగ్రహముల గమనములు కనిపెట్టి వారియనుభవము వ్రాసియుంచినందుననేకదా యిప్పుడు మనము ఈ దినమున చంద్రు డిన్ని కళలు కల్గి యాకాశమున నిచ్చోట నుండునని చెప్పగలము. జ్యోతిశ్శాస్త్ర మీరీతున నభివృద్ధిజెందెను. మానవశరీరమును అనేకరీతుల బరీక్షించి చూచి తలలో బుఱ్ఱెక్రింద మస్తిష్క మున్నదనియు, నిదియే జ్ఞానమునకు మూలాధారమనియు, అది చెడినచో మానవుడు పిచ్చివాడగుననియు, గనుగొనిరి. ఇది శారీరశాస్త్రము (Physiology) యొక్క విషయము. నీరు మిక్కిలి కాచినయెడల ఆవిరియై వాయురూపము జెందును. నీటిలోనుండి వేడిమిని దీసివేసి చల్లతనమును హెచ్చించినయెడల అది మంచుగడ్డయై ఘనరూపమును (Solid) దాల్చును. ఈసంగతి గనిపెట్టి 'పదార్థములను ఉష్ణత యనుశక్తి వాయురూపముగా మార్చును. శీతలము పదార్థమును ఘనరూపముగా మార్చును' అని సిద్ధాంతీకరించిరి. ఇది పదార్థవిజ్ఞానము (Physics) లోనియొకశాఖ. అనగా బైనివర్ణింపబడిన వైద్యజోతిషశారీరపదార్థ విజ్ఞానశాస్త్రములును ఇతర ప్రకృతిశాస్త్రములన్నియు అనుభవసిద్ధములు. అనేక సంవత్సరములు కష్టపడి స్వయముగా నెన్నెన్నియో ప్రయోగములు (శోధనలు:Experiments) చేసినగాని యొక్కొక్క పదార్థముయొక్క గుణధర్మములు తెలియవు. ఆవిరియంత్రము గనుగొనుటకును, నేడు మన మెక్కుచున్న పొగబండ్లయుక్తి పూర్తి యగుటకును వందలసంవత్సరములు పట్టినవి. విద్యుత్ (మెఱుపు) ను గుఱించి రెండువందల యేండ్లనుండి శోధనలు జరుగుచున్నవి. అందుచే జనుల కనేక లాభములు కలుగుచున్నవి. క్రొత్తక్రొత్తయంశములు తెలియు చున్నవి. ఈ భౌతికశాస్త్రములకు సంబంధించిన శోధనలన్నియు సకలజనులకు సాధ్యములు, ప్రత్యక్షములు, ఇంద్రియ గోచరములు, ఒకరికి గాన