పుట:Jeevasastra Samgrahamu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తల్లిదండ్రులు లేకయే కషాయముననుండి పుట్టినవని చెప్పవచ్చుననియు వీరు వాదించిరి.

ఈ ముఖ్యాంశములను వా రీ దిగువ కనబరచిన రీతిని శోధించిరి. మిక్కిలి సన్నని పొడుగుమెడ గల గాజుకుప్పె నొక దానిని తీసికొనిరి. దానిని మాంసరసముతో నింపిరి. పిమ్మట దానిని కొంతకాలము కాచి మసలనిచ్చిరి. అప్పటికి సూక్ష్మజీవుల బీజముల గురించి వారల కేమియు తెలియదు. ఈప్రకార మా రసము కళవెళలాడుచున్న సమయమునందు ఆ బుడ్డియొక్క సన్నని మెడ గొట్టమును కరగునట్లు కాచి దానియందలి రంధ్రమును మూసివేసిరి. ఇట్లు చేయుటచే వారు వెలుపలనుండి వచ్చు సూక్ష్మ జీవులనే గాక గాలినిగూడ గాజుకుప్పెలోనికి చొరకుండ తొలగించిరి. కాని ఏవిధమైన రేణువులును ప్రవేశింపకుండునట్లు ఏర్పరచినయెడల పరిశుభ్రమైన గాలి బుడ్డిలో ప్రవేశించినను భంగము లేదు కాన, వారిలో కొందరు గాజుబుడ్డిలో సగమువరకే నీరు పోసి, మూతిని కరగించి మూయుటకుబదులుగా మెడగొట్టములో రెండుమూడంగుళములవరకు పరిశుభ్రమైన దూదిని బిరడవలె క్రుక్కిరి. పిమ్మట దీనిని యథావిధిగా మరుగబెట్టిరి. ఇట్లు చేయుటచే గాలి దూదిగుండ బుడ్డిలోనికి ప్రవేశించునేగాని దట్టముగనుండు నీ దూదిమూలమున నేవిధమైన నలుసులైనను కుప్పెలోనికి చొరనేరవు. కాన నీ యుపాయముచే వారు గాలిలో నుండు సూక్ష్మజీవులనుగూడ కుప్పెలోనికి ప్రవేశించకుండునట్లు