పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాజిమల్లి

సాంఘిక నవల

(ప్రథమ గుచ్చము)

పువ్వులను చూస్తే ఆనందపడని బాలిక ఎవరు? పువ్వులు జన్మ చాలించి పూబోడులై పుడతాయో, పూబోడులే అవతారాలు చాలించి పూవులై పుడతారో పద్దాలు చిన్న బాలిక. వాళ్ళింటి దగ్గరవున్న నాగమల్లి చెట్టు పువ్వులు వానాకాలంలో జల్లులు జల్లులుగా రాలుతూన్నప్పుడు, తెల్లవారుతూనే లేచి, ఆ చిరిగిపోయిన తాటాకు బుట్టలో పోగుచేసి ఏవేవో అర్థంకాని, అర్థానికి అతీతమైన, చిన్న బిడ్డల వెర్రిపాటలు పాడుకుంటూ పోగుచేసేది. “అమ్మా! యీయాళ ఎన్ని పూవులు దొరికాయో! ఏంటనుకున్నావు. ఈయేళ ఈ పువ్వులన్నీ ఎట్టి జడేసుకుంటానమ్మా!” అని వాళ్ళ పూరిగుడిసెలో గంతులు వేసేది.

“మల్లెలు మల్లెలు కాడల మల్లెలు
జల్లులు జల్లులు తెల్లని మల్లెలు”

అని ఓ పాట సంపూర్ణమైన యాసతో పాడుతూ ఆ బుట్టను తన హృదయానికి అదుముకొని “ఓ లమ్మా! జడయెయ్యవంటే?” అని తల్లిని ప్రశ్నించింది.

ఇంక ఏమి పువ్వులుంటాయి ఆమె ఈ చిన్ననాటి జీవితంలో! వాళ్ళయ్య పనిచేసే దశరథరామిరెడ్డి పొలంలో సంక్రాంతి రోజులలో వికసించే బంతి పూవులూ, బొడగ బంతిపూవులూ, సీతామ్మవారి జడపూవులూ, బంగారం ముద్దలు, పొద్దుపొడుపు పూవులూ,

రకరకాల గోంగూర పూవులు చెవుల్లో పెట్టుకొనడానికి ఎంత అందంగా వుంటాయో అందుకనే వాటిని పూర్వకవులు కర్ణికా పుష్పాలనేవారు. గోంగూరపూవులలో ఎన్ని రంగులున్నాయి. ఎరుపు, నీలం, తెలుపు, పసుపు, చంద్రబింబాలులా విచ్చియున్న ఆ పువ్వుల హృదయంలో మధురరాగము. రాగవర్జిత విరాగహరితమై పుప్పొడులు ప్రసరిస్తూ పొలయించి వుంటుంది. దూరాన ఆవలి చిట్టడవిలో కొండ తంగేడు పూవులూ, మోదుగపూవులూ, వానకాలంనాటి దిరిశన పూవులూ ఆమెకు ఎంతో ఇష్టం.

ఆమెకు తల దువ్వడానికి నూనెలేదు. వాళ్ళదొర రెడ్డిగారింట్లో యిచ్చిన నువ్వులనూనె, కూర తాళింపుకోసం మాత్రం సరిపోయేది.

బిరుసైన ఉంగరాలజుట్టు తుమ్మెద రెక్కలలా నిగనిగలాడుతూ వున్నా, సంస్కారంలేక బాగా పెరగక తొలకరి చిరుమబ్బుల్ని నలుదిక్కులకూ ప్రసరిస్తూ ఉండేది. దొరబండ్లకు చక్రాల యిరుసులకు చుట్టిన నార తడపడానికి చిక్కని ఆముదం తెచ్చేవాడు తన అయ్య. అది నవ్వుకుంటూ చేతులకు రాసుకొని తలంతా పులుముకొనేది తల్లి దువ్వుకొనే కర్ర దువ్వెనతో చేతులు పడిపోయేటట్లుగా దువ్వుకొని, తల్లి దగ్గరకు పరుగెత్తి జడవేయించుకొనేది. అమ్మయ్య! అప్పుడు పెట్టుకొనేది పువ్వులు. ఆ బిడ్డ ‘పద్ది' పల్లెవాళ్ళ ఎఱ్ఱ చందనం బొమ్మ!

అడివి బాపిరాజు రచనలు-7

97

జాజిమల్లి (సాంఘిక నవల)