పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



5

మర్నాడు ఉదయం సర్ ఎడ్వర్డు కార్లయిల్, భార్యా లోనవాలా స్టేషనులో దిగినారు. స్టేషనులో జెన్నీ, మూర్తి వీరికోసం ఎదురు చూస్తున్నారు. బండి దిగగానే మూర్తి మామగార్కి నమస్కరించినాడు. ఇద్దరు ఆనందంగా కరస్పర్శ కావించినారు. తల్లి కొమరితను కౌగలించుకున్నది.

అందరూ కలిసి మూర్తి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఫలహారాదులు అయిన వెనక అల్లుడూ, మామా కూర్చుండి మాట్లాడుకోవడం సాగించారు. ఆరోజు ఆదివారం అవడం వల్ల మూర్తికి సెలవు.

'సర్ ఎడ్వర్డూ: కాబట్టి నువ్వు ఇంకో ఆరు నెలల్లో పని పూర్తి చేయగలవన్నమాట?

మూర్తి: తప్పకుండా నండి!.

'సర్ ఎడ్వర్డూ: ఇంతవరకూ చేసిన పనిని పెద్దవాళ్ళెవరైనా వచ్చి చూచారా?

మూర్తి: మూడు నాలుగుసార్లు వచ్చి చూచారండీ!

ఆ సాయంకాలం నలుగురూ జలాశయం కట్టే స్థలానికి వెళ్ళి చూచినారు. సర్ ఎడ్వర్డు మంచి ఇంజనీరు అవడంవల్ల మూర్తి చెప్పేవి అన్నీ వింటూ, పరిశీలిస్తూ గమనించాడు. మూర్తి అఖండ ప్రజ్ఞావంతుడనిన్నీ అదృష్టవంతుడయితే భారతదేశం అంతకూ ఇలాంటి జలాశయాది నిర్మాణంలో ఈతడు రత్నస్థగితమకుటంలాంటి వాడు అవుతాడనీ అనుకున్నాడు.

వీరిద్దరూ ఇక్కడ వుండగానే మదరాసునుంచి మేజరు కార్లయిల్ భార్యా, బిడ్డలూ, తిరుచునాపల్లినుంచి లయొనెల్ భార్య ఎలిజబెత్తూ వస్తున్నామని తంతి ఇచ్చారు.


★ ★ ★


అడివి బాపిరాజు రచనలు - 7

88

నరుడు(సాంఘిక నవల)