పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



2

ఆ మర్నాడు ఉదయం నిడదవోలులో రైలు మారి. మూర్తి భీమవరంలో దిగాడు. ఇదివరకే తమ పురోహితుడుగారి పేర టెలిగ్రాం అతడు ఈ దినానికి వస్తానని ఇచ్చి వుండడంవల్ల భీమవరం స్టేషనుకు జక్కరంవారూ, భీమవరం వారూ చుట్టుపక్కలవారు హరిజనులెందరో వచ్చి సిద్ధంగా వున్నారు. బండి రాగానే ఎల్లమందమూర్తికి “జయ్” అని వచ్చిన వారందరూ జయజయ ధ్వానాలు సలిపినారు. బండి ఆగగానే ఎల్లమంద దిగినాడు. ప్రజలందరూ పూలమాలలు వేశారు. ఖద్దరు దండలు వేశారు. హరిజన సంఘంవారు యెవరిదో కారు పట్టుకు వచ్చారు. ఎల్లమందను భీమవరం అంతా ఊరేగించి బోర్డు ఆఫీసుదగ్గిర పెద్ద సమావేశం జరిపినారు.

ఎల్లమంద ఉక్కిరి బిక్కిరై, చైతన్యం సగం తప్పి ఈ మహా భావానికి ఉన్న పరమార్థం తర్కించుకుంటూ కూచున్నాడు.

“హరిజనులు యుగయుగాలనుంచి ఇలా వేదన పడిపోతున్నారు. కాని యెవరో ఎల్లమంద వంటి కులోద్ధారకులు ఉద్ధరించి జాతిని తరింపచేస్తారు.” అని ఒకరన్నారు.

ఉత్తమ కులాలవారు వింధ్య పర్వతంలాంటి బరువును ఈ కులాలవారిమీద వేసి వుండడంచేత వారు అలా నీచ స్థితిలోపడి ఉన్నారు. తప్పు ఉత్తమ కులాలవారిది. ఇన్ని యుగాలనుంచి, ఊళ్ళ బయటకు నెట్టి, చూడకూడని వారు, ఉచ్చరింపకూడనివారు, గ్రామంలోనికి రానివ్వకూడనివారు అని చెప్పి వారిని, సాంఘికంగా, నైతికంగా, ఆర్థికంగా, విద్యా విషయికంగా, రాజకీయంగా అతి నీచస్థితిలో వుంచిన పరమ రాక్షసులం మనం!” అని ఒక బ్రాహ్మణ యువకుడు మాట్లాడినాడు.

ఎల్లమంద యెప్పుడూ ఉపన్యాసాలిచ్చినవాడు కాడు. అతడు లేచి పది నిమిషాలు తడబడినాడు. అక్కడినుంచి ఎదురుగుండా ప్రేక్షకులు లేరు, ప్రపంచం లేదు. అతని ఎదుట అతడు ఉన్నాడు. అతనికి అతడే మాట్లాడుకున్నాడు.

“ఈ పరిస్థితులు యెలా వచ్చాయి? చరిత్ర అతిక్లిష్టంగా ప్రవహించింది. దానికి ఇవి కారణాలనిగానీ, అవి కారణాలనిగాని ఎవరు నిర్ణయించగలరు? ఆ నిర్ణయించడం వల్ల ప్రయోజనం ఏముంది? నదిలో పడిన మనుష్యుడు ఏలా పడ్డాడో విచారణ చేస్తుంటే అతడు ప్రాణం అర్పించుకోవలసి వస్తుంది. వెంటనే అతన్ని రక్షించాలి.

“హరిజనులకు కాంగ్రెసు ప్రభుత్వాలు మనుష్యునకు పది యెకరాలకు తక్కువగాని భూమి ఇవ్వాలి. తక్కిన వారి మాట ఎల్లా ఉన్నా హరిజనాది హైస్య సంఘాలవారికి తప్పక పట్ట పరీక్ష వరకు చదువు చెప్పాలి. ఆ శాసనం యెవ్వరూ తప్పటానికి వీలులేదు. ప్రస్తుతం దేవాలయాలకు పోవడం వగైరాలన్నీ కార్యక్రమంలో తర్వాత వస్తాయి. అవి కావలసిన మాట నిజమే!”

ఈలా ఈలా మహా వేగంతో మాట్లాడినాడు.

ఉపన్యాసానంతరం ప్రజలు యెల్లమందకు బ్రహ్మాండమయిన జయజయధ్వానాలు సలిపినారు.

అడివి బాపిరాజు రచనలు - 7

48

నరుడు(సాంఘిక నవల)