(నాలుగవ భాగం)
జలపాతం
మూర్తి నాలుగు రోజులు మదరాసులో ఉండి, కాంగ్రెసు నాయకుల్ని, కాంగ్రెసు మంత్రివర్గాన్నీ, హరిజన సేవాసంఘ నాయకుల్ని చూచినాడు.
వైస్రాయి: ఆంతరంగిక కార్యదర్శి నుండి పన్నెండు దినాలయిన వెనుక ఒక తారీఖు రోజున ఢిల్లీ రావలసిందని ఉత్తరం వచ్చింది. ఈ అయిదవ దినాన రాష్ట్ర గవర్నరు గారిని దర్శించినాడు.
ఈ అయిదు దినాలూ, తాను అమెరికాలో గడిపిన సంవత్సరాలూ మొదలయినవి చర్చించాడు. అందరూ అతన్ని మెచ్చుకుంటూ మాట్లాడారు. కాని అతని కర్తవ్యం ఎవ్వరూ నిర్ణయించలేదు.
లయొనెల్ ఎలిజబెత్తు చేసింది తప్పు అని ఎలా చెప్పగలడు? భార్యతో మూర్తిని పొగడి తమ స్నేహం ఎంత పవిత్రమో ఆమెకు తెల్పినాడు .
“మీ స్నేహం పవిత్రం కాదని నేను ఊహించలేదు. అంత మాత్రాన అతణ్ణి నీ చెల్లెలు వివాహం చేసుకొనడానికి నేనెలా సమ్మతించగలను?”
"వివాహానికి ప్రేమ ముఖ్యమంటావా లేక జాతి, సంఘము, రంగూ, ముఖ్యమా ప్రియా!”
“నువ్వు గజం పొడుగు ముందుకు వచ్చిన పెదవులు కలిగి, ఊలు జుట్టుతో, పీపాలాంటి కడుపుతో ఉన్న ఆఫ్రికా పిగ్మీ పిల్లను ప్రేమించగలవా?”
“ప్రేమించడం జరిగిన వెనుక ప్రేమను గురించి మాట్లాడాలి కదా! ఇక్కడ జెన్నీ మూర్తినీ మూర్తి జెన్నీని ప్రేమించుకొంటున్నారు గదా!”
“మూర్తి ఒక రిక్షాలాగే కూలీ అయితే వారి ప్రేమను నువ్వు ఒప్పుకుంటావా?”
"ఏదో అయితే గియితే అంటే ఏమి లాభం విజ్జీ! నా ప్రాణ స్నేహితుడు నా అనుంగు చెల్లెలూ ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకుంటే నేను ఆనందపూర్ణుడను కానా?”
“ఓహో కాకేమి? నేను ఉత్తమజాతి ఇంగ్లీషు బాలికను. మా వంశంలో వాడవు నువ్వు! నీకూ నాకూ కలిగిన ప్రేమను లోకం హర్షిస్తుంది.”
“ప్రేమకూ లోకానికీ సంబంధం ఏమిటి?”
“ప్రేమించుకునే మనుష్యులు లోకానికి సంబంధం లేకుండా ఉద్భవించారా?”
లయొనెల్ ఏమి చేయగలడు? అతడు విచార పూర్ణ బాధతో క్రుంగిపోయాడు.
“ఇంతకూ మా జెన్నీ విషయంలో నేనేమి చేయగలను. ఆమె జీవితం దారి ఆమె నిర్ణయించుకోవాలి!” అంటూ అతడు తల వాల్చుకొని, తన కచ్చేరీ గదిలోకి వెళ్ళాడు.
ఎలిజబెత్తు మనస్సు కరగలేదు. పైగా, పౌరుషంతో దుఃఖం తెచ్చుకొని కన్నీరు
పెట్టుకుంటూ ఆ సోఫాపై కూలబడింది.
అడివి బాపిరాజు రచనలు - 7
45
నరుడు(సాంఘిక నవల)