పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“అయితే సంగీతం? పేరు? సభలూ? రికార్డులూ? సినీమా?”

“ప్రస్తుతం అన్నీ మానేస్తాను!”

“రేపు రాధాకృష్ణగారు వచ్చి బలవంతం చేస్తారు. సుశీలగారు వచ్చి బ్రతిమాలుతారు!”

“అవన్నీ లెక్కచేయనండీ! పరీక్షకని సంకల్పంతో కదా ఇక్కడ చేరిందీ! అవి పూర్తిచేసుకుని తీరుతాను.”

“ఇంక నేను చేసే ఏర్పాట్లు విను. నీ భర్తగాని, నరసింహమూర్తి మేష్టారుగాని సాయంకాలం వచ్చి మాట్లాడవచ్చును. సుశీలగారూ, రాధాకృష్ణగారు వస్తే నీకు తీరుబడి లేదన్న మాట! సంగీత బేరాలు ఏవీ ఒప్పుకోడానికి వీలు లేదు. ఏవైనా సరే! ఎంత గొప్పవాళ్ళయినా సరే! సాయంకాలం షికారు బందు! ఇవి ఇష్టమైతే పరీక్షకు దరఖాస్తు పెట్టిస్తాను. లేదంటావూ నువ్వు మీ ఇంటికెళ్ళవలసిందే!”

ఈ మాటలు ఖచ్చితంగా అధ్యక్షురాలు అంటూ వుంటే పద్మావతి ముఖం వెలవెలపోయింది. అది చూచి, "నేనింత నిష్కర్షగా అంటూ వుంటే మనస్సులో బాధపడకు తల్లీ! నీకోసమే చెప్పాను. ఏ విషయమూ వేళాకోళంగా చూడకూడదు. తర్వాత నీ ఇష్టము” అని అన్నది. పద్మావతి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయింది.

2

నరసింహమూర్తి మాష్టారుకు ఏదో ఆవేదన పట్టుకుంది. పద్మావతి విషయం చూస్తూవుంటే అతనికి మతిపోయింది. ఈనాడు ఆమె జీవితం తనకందని వేగంతో ప్రవహిస్తోంది. ఆ మహాఝంఝామారుతంలో తానో మూలకు కొట్టుకొనిపోయినాడు. అతణ్ణి గమనించేవారే లేరు. రాధాకృష్ణ “ఓహో!” అంటాడు. “మేష్టారూ! ఎప్పుడు వచ్చారండోయ్!” అంటాడు. “సుశీల లోపల ఉందండీ!” అంటాడు; ఆ తర్వాత ఆ ముక్కలూ అనడం మానివేశాడు.

రాధాకృష్ణ గానమేళంలో, మొదట అతడు ఫిడేలు వాయించేవాడు. ఆ రోజుల్లో “మేష్టారూ! ఈ పాట ఈ రకంగా ప్రారంభిద్దాము” అనేవాడు. “గురువుగారూ, ఇప్పుడు ఆ ఫ్లూటు ఈ సంగతులు వేస్తే బాగుంటుంది కాదండీ!” అనేవాడు. నేడు అలాంటి సలహాలు అడగడు. ఆయన రాకపోయినా రాధాకృష్ణ మేళం సాగిపోతూనే వుంది. రమ్మనమనీ అడగడం తగ్గించాడు.

అప్పుడంత గౌరవం చేసిన రాధాకృష్ణ నేడింత ఉదాసీనం వహించాడేమిటి?

నరసింహమూర్తి మేష్టారి హృదయం కృంగిపోయింది. అటు బుచ్చి వెంకట్రావూ తనకు దూరమైపోయాడు. ఇటు పద్మావతీ చదువులో పడిపోయింది.

బుచ్చి వెంకట్రావు సుశీలాద్వితీయుడై లోకం అంతా తిరుగుతున్నాడు. ఇప్పుడంత త్రాగడానికి వీలులేదు. పట్టణంలో ప్రొహిబిషను వచ్చింది. రహస్యంగా ఏలాంటి బుడ్లయినా దొరుకుతాయి. కాని అతనికి ధైర్యం లేకపోయింది. త్రాగుడు అతనికి జీవితంలో భాగం కాలేదు. పైగా త్రాగుడు కన్న నిషాకలిగిన సుశీల స్నేహం దొరికింది. ఆ స్నేహంలో

అడివి బాపిరాజు రచనలు - 7

137

జాజిమల్లి(సాంఘిక నవల)