ఇప్పుడేముందీ? జమీందారీలు లాగేశారు. స్వతంత్ర సంస్థానాలు ఎగిరి పోయాయి. ఎక్కడినుంచి వస్తారింక అపరభోజులూ, కృష్ణదేవరాయలూను!
బుచ్చి: జమీలూ అవీ పోవలసిందే అనుకోండి. కాని లక్షలు ధనం ఆర్జించే ధనస్వాములకు ఏం పొయ్యేకాలం వచ్చింది చెప్పండి?
నర: ఈ దేశంలో ప్రభుత్వం కులతత్వ ప్రభుత్వం! తక్కిన దేశోద్ధారక ప్రణాళికలన్నీ కులతత్వ రాక్షసి కడుపులో ప్రాణాయస్వాహా అయిపోతున్నాయి.
రాధా: ధనస్వాములకు కళలెందుకండీ. సంగీతం పాడే బాలిక మీద ఎక్కువ మోజు. అందుకనే సినిమాలు. సినీమాలు అని కంపెనీ పెడుతూ ఉంటారు. అలా పెట్టడం మా బోటివారికి లాభమే అనుకోండి. లేకపోతే ఎంతమందో చిత్రకారులూ, గాయకులూ మాడిపోవలసిందే కదా!
బుచ్చి: నేను ఇంతవరకూ కొంచెం కళావేత్తలు అనుకున్నవారి సలహాతో ఒక డజను మంచిబొమ్మలు కొన్నాను రాధాకృష్ణగారూ! రండి చూద్దురుగాని.
రాధా: మొత్తం ఏమాత్రం అయివుంటుందండీ!
బుచ్చి: పదిహేనువందలు ఖర్చయ్యాయి. కాని అంత విద్య సంపాదించుకొని, అలా అందంగా బొమ్మలువేస్తే నూరు నూటయాభై వారిని ఏం పోషిస్తాయి చెప్పండి?
రాధా: చూడండి, మా సినిమావారు లక్షలు సంపాదిస్తారు. ఒక్కబొమ్మ కొన్న డైరెక్టరుగాని, తారగాని, తారకుడు గాని ఉన్నారా? ఒక్క రామబ్రహ్మంగారు తప్పబుట్టాడు మహానుభావుడు.
నర: ఏమనుకుంటే ఏం లాభం? ప్రభుత్వం ప్రజారాజ్యం అంటారు. ప్రజలకు కళ కావాలికదా. ఆ కళను ప్రదర్శనశాలలుగా ఏర్పాటు చెయ్యాలి ప్రభుత్వం. ఈ ప్రజా ప్రభుత్వాలకు మాటలు జాస్తీ, చేతలు నాస్తి.
బుచ్చి: ఎప్పుడండీ మీ సంగీతం మేము వినడం?
రాధా: నా కారు పంపిస్తాను.
నర: మా కారుమీదే వస్తాములే! నీకు ఎప్పుడు వీలో, అప్పుడే వస్తాము. మా అమ్మాయినీ తీసుకువస్తాము.
రాధా: రేపు రాత్రి ఎనిమిది గంటలకు రండి. మా ఇంట్లోనే మీ భోజనాలు. మళ్ళీ కాదనకండి. మాకు కులం తేడాలు లేవండోయ్ బుచ్చి వెంకట్రావుగారూ.
బుచ్చి: నాకు ఆ విషయంలో ఎవరినీ, ఏమీ ఇబ్బంది పరచకూడదని నియమం.
రాధా: మా ఆవిడ ఒక నాయరమ్మాయి. సంగీతానికీ, నాట్యానికీ నాకు శిష్యురాలయింది. ఆ తర్వాత భార్య అయింది. కాని మన బ్రాహ్మణులకన్నా ఆచారాలే. మాంసం చూడలేదు, చేపవాసనే గిట్టదు. కోడిగుడ్డు కూడా పడదు.
బుచ్చి: మాకూ ఈ మాష్టారు పుణ్యమా అని చప్పటి భోజనమే అలవాటయింది.
రాధా: కాబట్టి తప్పకుండా రేపు రావాలి. మీ ఫోను నెంబరివ్వండి. ఫోనులో జ్ఞాపకంచేస్తాను. సెలవు. నమస్కారం మేష్టారూ.
రాధాకృష్ణ సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు.
అడివి బాపిరాజు రచనలు - 7
126
జాజిమల్లి(సాంఘిక నవల)