పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

ఎంత నికృష్టమైన జీవితం పల్లెజాతివారిది? వారిని పల్లీలంటారు. వారిలో పెద్దలు కొందరు అగ్నికుల క్షత్రియులమని పిలుచుకుంటారు. ఆలాంటివాళ్ళు యజ్ఞోపవీతాలు కూడా వేసుకుంటారు. వారి గ్రామం 'కావలి'కి నాలుమైళ్ళ దూరములో ఉంది. అది గ్రామమేమిటి? అది పల్లెవాళ్ళ చిన్నపల్లె. ఆ బాలిక పూర్వీకులు అనాది కాలం నుంచీ సముద్రంలో పడవలు కట్టుకుపోవడం సాయంత్రానికి పడవలు చేపలతో తిరిగిరావడం, ఆ చేపలు ఎండబెట్టి ఎండు చేపల క్రింద ఎగుమతి చేయడం, లేక పచ్చిచేపలుగా అమ్మేయటమో అలాంటి వ్యాపారం చేసి జీవితం సాగిస్తూండేవారు.

ప్రాణాలు ఒడ్డి, పడవడు చేపలు పట్టుకొని వచ్చినా మధ్యవర్తకుల పాళ్ళన్నీపోగా ఇంక వారికి మిగిలేది ఏముంటుంది గనుకా? అందుకని ఆమె అయ్య దశరధరామిరెడ్డి గారికి పాలేరుపని చేస్తూండేవాడు. దానా దీనా అతడి పెద్ద కుటుంబం ఆకలిగీత దాటకుండా బ్రతుకుదారిలో ప్రయాణం చేస్తూండేది.

ఆమె తాత, అవ్వ, పెద్దయ్య, అయ్య, చిన్నయ్య, వాళ్ళందరి బిడ్డలు, ఆమె అన్నదమ్ములు, అక్క సెల్లెళ్ళు మొత్తం వారి రెండు మూడు గుడిసెల్లో అందరూ కలిసి ముప్పై ఆరుగురుండేవారు. ఏటిలో వలలువేసి చేపలు పట్టినా, సముద్రంలోకి పోయి చేపలుపట్టినా, ఆ పాటు అంతా మగవాళ్ళదే. తట్టలతో కావలీ, బిట్రగుంటా పోయి అమ్ముకురావడం వంతు ఆడవాళ్ళది.

తమ బట్టలన్నీ చేపల వాసనకొట్టేవి. తమ యిండ్ల చుట్టూ చేపలవాసన. ఇల్లంతా చేపలవాసన. చివరికి వళ్ళంతా చేపలవాసనే! వారి పూర్వీకురాలైన మత్స్యగంధి చరిత్ర ఎవరు వినలేదు! ఆమె జీవితములో పరాశరుడు ప్రవేశించి ఆమెను యోజనగంధిని చేసినాడు. ఈ బాలిక పద్దాలు జీవితములో బుచ్చి వెంకులు పరాశరుడూ, శంతనుడూ కూడా!

3

పద్దాలుకు పదహారో ఏడు వచ్చింది.

సముద్రం మధించిన లావణ్యాలు సుడులు సుడులుగా ఆమెలో చేరుకుంటున్నాయి.

చింపిరిజుట్టు పొడుగై, ఉంగరాలు తిరిగి, లోతు సముద్రాల నీలాలై, సముద్రం ఆవలిగట్టు కాటుక కొండలై నిగనిగలు తేలింది.

ఆమెకు యవ్వనం వచ్చి రెండేళ్ళయింది:

ఆ పల్లెవాళ్ళలో పల్లెనాయకుడు వీరాస్వామి కొడుకు బుచ్చి వెంకన్న. అతనికి పద్దిని ఇవ్వడానికి వారిరువురి చిన్నతనంలోనే నిశ్చయం చేశారు పెద్దలు. ఉక్కు విగ్రహంలాంటి బాలుడు. సముద్రం మొసలిలాంటి శక్తిమంతుడు, నల్లమద్ది చెట్టులా కమ్మెచ్చులు తిరిగిన కండలుకట్టిన దేహంతో బార ఈతలో సముద్రములో ఎంత దూరానికైనా వెళ్ళేవాడు.

బుచ్చి వెంకులంటే పద్దికి తన ఎనిమిదో ఏటినుంచీ ప్రాణమే. ఆనాటికే వాడు ఒక్కడూ తెరచాప ఎత్తి నావ నడుపుకుపోయేవాడు! ఎంతదూరమైనా సముద్రంలోనికే. మాటలు తక్కువ. చేతకు ఎప్పుడైనా సిద్దమే. తన పల్లెలో ఏ పని వచ్చినా, అంత

అడివి బాపిరాజు రచనలు - 7

98

జాజిమల్లి(సాంఘిక నవల)