పుట:Jagattu-Jiivamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలాకాశవైచిత్రి

55

ఒక్కొక్క నక్షత్రవాసులకు ఒక్కొక్కసారి గోచరిస్తుంది. ఇట్లు శతాబ్దాలక్రింద భూలోకంలో గతించిన జీవులు ఆకాశంలోను ఆకాశ కృతకాలంలోను జీవిస్తూనే ఉన్నారు. ఆజీవుల వర్తమానం అంతం కాలేదు. అది అంతంలేని ఆకాశంలో పొడిగింపబడుతూంది. కాబట్టి కాలవిషయంలో గతించినది ఆకాశవిషయంలో చిరస్థాయిగా వర్ధిల్లుతూంది. అంతేకాదు; జీవం ఒక స్థలంలో నశించవచ్చును, ఒక కాలంలో నశించవచ్చును. కాని, జీవంయొక్క ప్రతిమ కాలాకాశంలో ఎన్నడును నశించదు. అయితే దానిని పునః గ్రహించు విధానం నేటివరకు మన మెరుగము. అయినప్పుడు సత్యమైన కాలమేది ? సత్యమైన ఆకాశమేది ? సత్యమైన జీవమేది ?

ఇట్లు, విశ్వజనీన దృష్టితో యథార్థం పరిశీలిస్తే మనకెన్నడో జరిగిపోయిన ఒక ఘటన ఆంటారిస్ విజ్ఞాని దృష్టిలో ఇప్పుడు సంభవిస్తూంది. అందులో పాల్గొన్న జీవులు వానికొఱకై నేడు పునర్జీవితులు కాలేదు. వారందరు భూలోక జీవితం చాలించి, 17 వ శతాబ్దంలో భూదేవికి శరీరాల నర్పించినవారే ! కాని, ఆంటారిస్ విజ్ఞానికి దృఢశరీరాలతో ఇప్పుడు గోచరిస్తున్నారు. వాని వర్తమానంలో ఆజీవులు సజీవులై యున్నారు. ఇక, రిగెల్ విజ్ఞానిదృష్టికి ఆ ఘటన భవిష్యత్తులో గుప్తమై యుంది. మరొక 150 సంవత్సరములు గతిస్తేనేకాని అతనికాదృశ్యం గోచరించదు. ఈ 150 సంవత్సరాలలో కాంతి యాత్ర సాగిస్తూనే ఉంటుంది. వానిదృష్టిలో అక్బరు పుట్టనేలేదు.

అసలు, కాలభావం ఆకాశంతో జనించింది. ఆకాశంలో వస్తు చలనం లేకపోతే కాలభావమే కలుగకపోను. త్రికాలవృక్షంలో