పుట:Himabindu by Adivi Bapiraju.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సువర్ణ: అందరు ఇచ్చట చేరినారు. అచ్చట నాయనగా రీపాటికి జపము చాలించి యుందురు. పదండి భోజనములకు. అమ్మయు, మహాలియు వడ్డనమాటే మరచిరి.

తండ్రిగారును, సువర్ణశ్రీయు, ముప్పదినలువురు విద్యార్థులును భోజనము చేసిన వెనుక సేవకుడు కరదీపిక చూపించుచుండ, వారందరు ధర్మనంది శిల్పవిద్యాగారమునకు బోయినారు. అచ్చట దంతాసనముపై కృష్ణాజినముపై ధర్మనంది వసించెను. చుట్టును కుడ్యములనంటియున్న శాద్వలాసనములపై విద్యార్థులును, సువర్ణశ్రీయు నధివసించిరి.

ధర్మనంది గ్రంథపీఠముపై భూర్జపత్రశిల్ప శాస్త్ర గ్రంథమునుంచి, అదిచూడకయే బాలుర కుపదేశింప నారంభించెను. భరతనాట్య సూత్రములు, శిల్పసూత్రములు, రూపరచనా ప్రమాణము, అంకము, ధారణము, రూప ప్రతిరూపములు, మాన ప్రతిమానములు, దేవతా మనుష్య గుహ్యక వానరాదిప్రమాణములు, ఉత్తమపురుష లక్షణములు, స్త్రీల యాకారములు, పద్మ సుఖ వీర యోగాది వివిధాసనములు, అభయ, వరద జ్ఞానాదిముద్రలు, లంబ లీల లోలాది హస్తములు, సమద్విత్రి అతిభంగాది భంగిమములు, పద్మ పద్మపత్ర మత్స్య కురంగ చక్రవాకాది లోచనభేదంబులు, గరుడ సమ శుక తిలపుష్పికాది నాసికాభేదంబులు - ధర్మనంది గంభీరకంఠమున ఆ పవిత్ర సమయమున శిష్యుల కుపదేశించెను.

ఈ పాఠము జరుగుచున్నంతసేపును సువర్ణశ్రీకుమారుని మనస్సు హిమబిందు తన యింటికి వచ్చుట, తాను పారిపోవుట, స్థూపముకడ మరల నా బాలికను సందర్శించుట, ఏవేవో పిచ్చిమాటలు తాను పలుకుట, ఆమె “దారి యిమ్మనవే!” యనుట ఈ దృశ్యములన్నియు నాతని మనోనయనాల ఎదుట ప్రవాహతరంగములరీతి ఒకటి వెంటనొకటి వచ్చి మాయము కాసాగినవి.

27. వసంత సౌరభము

పదునారు సంవత్సరములు నిండి పదునేడవ సంవత్సరము రాబోవు తరుణ వయస్సున బాలికలకు వసంతోదయ ప్రారంభము. ఆ వసంతము నందు సౌరభము లలమికొన ఉప్పొంగి వికసించబోవు మల్లికాకుట్మలము హిమబిందు.

చిన్నతనమునుండియు మహారాజకుమారికలకు జరుగని వేడుకలు, లాలనలు, ముద్దులు, మురిపెములు హిమబిందునకు నెల నెలకు జరిగినవి.

హిమబిందుతల్లి ప్రజాపతిమిత్ర. ఈమె సర్వభారతీయ దేశములతో వర్తకమొనర్చు కీర్తిగుప్త వణిక్సంపన్నుని కుమార్తె. కీర్తిగుప్తుల వారు ధాన్యకటకనగరమునందు విశాలమైన రాజవీధిలో తన భవనము నిర్మించుకొని వర్తకము చేయుచుండెను. ప్రతిష్ఠానమునందు, పాటలీపుత్రమునందు, ఉజ్జయిని యందు, పిష్ఠపురము, దంతిపురము, కాంచి మధుర, తాత్రలిప్తి, భరుకచ్ఛము, కౌశాంబి, మహాశకవతి, కన్యాకుబ్జము, పురుష పురము, ప్రయాగ, పుష్కలావతి, కాశీ, తపిక, తక్షశిల మొదలైన ప్రసిద్ధనగరములందు తన వర్తకస్థానముల నేర్పరచుకొని మహోత్తమ వణిక్సంపన్నుడని పేరుపొందినాడు.

ఆ దినములలో గాంధారమున యవనులు రాజ్యము చేయుచుండిరి. యవన వర్తకుడైన డెమిత్రియసును, కీర్తిగుప్తుడును గాఢమిత్రులైనారు. వీరి వస్తువులు వారు, వారి వస్తువులు వీరు వర్తకమునకై మార్చుకొనుచుండిరి. వర్తకమున కంతయు వ్యవహార

అడివి బాపిరాజు రచనలు - 2

• 72.

హిమబిందు(చారిత్రాత్మక నవల)