పుట:Himabindu by Adivi Bapiraju.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25. సమావేశము

హిమబిందుకుమారి తన ఇంటికి వచ్చినదని తెలిసిన వెనుక సువర్ణశ్రీ కుమారుడు ఆ బాలికకు కనిపించుటకు సిగ్గుపడినాడు.

పాపము, వారిబండి వెనుకబడిపోయినది. తనగిత్తలు అద్భుత వేగము కలవి. సమవర్తిసేనాపతి తోలిన బండి ఆ సుందరిదని తెలిసినచో తాను రెండవవాడుగా వచ్చియుండునే! ఇప్పుడామెను చూచితీరవలయును. ఆ దివ్య సౌందర్యము చూచినంత మాత్రమున తనజన్మ మంతయు పవిత్రముకాదా!

కాని తా నె ట్లామెయెదుట బడగలడు? ఆమె తనను మొరకు వానిని, సౌందర్య హీనుని, వట్టి బొమ్మలు చెక్కుకొనువానిని ఆ దీర్ఘవినీల పక్ష్మముల నెత్తియైన చూచునా?

అవి కన్నులా, లోక మోహన నిశ్చల యామినీ మాయలు కాని! ఆ కన్నులలోని చూపులు, నిర్మల రాకాసుధాకర కళాకోటి! ఓహో తా నెట్లు ఆ చూపులలో అమృతత్వ మొందగలడు?

సువర్ణశ్రీ చల్లగా తన శిల్పమందిరమునుండి వినిర్గమించి, కృష్ణయొడ్డునే యెటకేని పోయినాడు.

అతడట్లు పోయి పోయి, ఎటుల పోవుచున్నదియు తెలియక, కోటి దీప కళికాప్రజ్వలమై దివ్యరూపమైన మహాచైత్యముకడ కరుదెంచినాడు.

ఆ చైత్యమును బౌద్ధశకము నూటపదునారవయేట మహాభక్తుడగు హిరణ్య వ్యాఘ్రపాదశాతవాహనుడు అప్పటి ధాన్యకటక నగరమునకు దూరమున కృష్ణాతీరమునకు కొలది దూరములో ప్రారంభించెనట.

అశోకచక్రవర్తి కాలమునకే ధాన్యకటక చైత్యము పేరునకు వచ్చి యుండెను. అప్పుడశోకుడా చైత్యమును పునర్నిర్మాణ మొనరింప శాతవాహన చక్రవర్తిని కోరి యుండెను. అశోకునకు సమకాలపు ఆంధ్ర ప్రభువు అజితదత్త శాతవాహనుడు. అత డా చైత్యమును ఇంకను పెంచి పెద్దదిగ నొనర్చెను.

అభయబాహు శాతవాహన చక్రవర్తి కాలమునాటి కా చైత్యము పూర్ణరూపము నంది బౌద్ధక్షేత్రమని పేరందెను.

శిల్పచక్రవర్తియు, శిల్ప బ్రాహ్మణవంశములో మహోన్నత యశో విరాజితుడును అయిన ధర్మనంది ఆ చైత్యమును దివ్యమొనర్చి ధర్మ చక్రములు, చతుర్ముఖములు, ఆయక స్తంభములు నిర్మించెను. ప్రదక్షిణాపథ మేర్పరచెను.

ప్రదక్షిణపథమును చుట్టి ప్రాకారరేఖ ధర్మనంది రచింప నారంభించి, శిష్యులచే ఊర్ధ్వస్తంభములు, సూచులు, ఆబంధికములు,ఉష్ణీషములు నిర్మించ ప్రారంభించినాడు.

బుద్ధధర్మము మహాస్థవిరవాద మనియు, మహాసాంఘికవాదమనియు రెండు మార్గముల ప్రవహించినది. మహా సాంఘిక వాదమున ఆంధ్రులు తమకున్న కళారక్తిచే, కళావేశముచే మహాచైత్యవాదము నిర్మించిరి.

ఈ శిల్పవాదము భారతవర్షమంతయు నిండి, యీ జంబూద్వీప మంతటి నుండియు శిల్పుల, ఆచార్యుల, శ్రవణకుల, భిక్షుల ఈ మహాపథ ప్రస్రవణ స్థానమైన ధాన్యకటకమునకు శిష్యులుగా పంపుచున్నది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 68 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)