పుట:Himabindu by Adivi Bapiraju.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాతని యూడిగపుగత్తె. ధన్వంతరివలె ఆతని దక్షిణహస్తమున అమృతకలశమున్నది. తక్షకునివలె ఆతని వామహస్తమున విషకుంభమున్నది.

స్థౌలతిష్యుని ఆశ్రమమునందు పురాణశ్రవణము, వేదాంతచర్చ, ధర్మశాస్త్రగోష్టి, సాహిత్యవిచారణ, ఆయుర్వేద, జ్యోతిష విచారణములు జరుగుచుండును.

సార్వభౌముడీ ఆశ్రమమునకు వలయు సౌకర్యములు అర్పించుచుండును. స్థాలతిష్యమహర్షి “నీ అర్పణయే నీకు నాశనము కాగల” దనిచిరునవ్వు నవ్వుకొను చుండును.

స్థాలతిష్యుని పూజామందిరమున ఎందరో పండితులు, మండలాధిపతులు, భూస్వాములు, మునులు, రాజకీయోద్యోగులు ఆ త్రయోదశినాడు చేరియుండిరి.

స్థాలతిష్యమహర్షి కృషభేశ్వరునియెదుట అలంకార రేఖావర్ణ సుందరమగు కాంకూరపత్ర కంబళిపై నధివసించి తపస్సు చేసికొనుచుండును. మండపమున చేరినవారందరు భక్తితో వివిధ కృష్ణాజినాద్యా సనములపై నధివసించియుండిరి.

స్థౌలతిష్యుడు తపస్సు చాలించి, నీరాజన సమర్పించుచు, అచ్చట నున్న సువర్ణఘంటికను దక్షిణహస్తమునగొని క్వంక్వణ నినదము చేసెను. ఆ మందిరమున పూజాపీఠమునకు ఎడమవైపున నున్న ద్వారమున విషబాల ప్రవేశించినది.

తోడనే పీఠముదాపుననున్న నలుగురు భక్తులలో నొకడు శంఖము నూదెను. ఒకడు జేగంట గణగణ వాయించెను. ఒక డొక భాంకారముపై “భం భం” నినాద మొనర్చెను. ఒకడు ఉచ్చైస్వనంబున సూక్తపాఠ మారంభించెను. పలువురు భక్తులాతని కంఠముతో దమ కంఠములు మేళవించిరి.

23. అభిచారము

అచటనుండి స్థౌలతిష్యమహర్షి ఆ మందిరముననే వేరొకయెడ ప్రజ్వలించుచున్న హోమకుండము కడ ఉత్తరాభిముఖుడై వ్యాఘ్రాజినముపై నధివసించి, గంభీరోచ్ఛాటనలతో అభిచారహోమము ప్రారంభించెను. ఆ అభిచార హోమము శత్రుమారణరూపమైనది.

“ఓ అగ్నివాయు సూర్య చంద్ర జలములారా!
మమ్మెవ్వడు ద్వేషించుచున్నాడో,
ఎవ్వని మేము ద్వేషించుచున్నామో,
అట్టివానిని మీ తాపశక్తిచే తపింపజేయుడు,
మీ దీప్తిశక్తిచే మండింపజేయుడు,
మీ దుఃఖదాయకశక్తిచే శోకింపజేయుడు,
మీ తేజశ్శక్తిచే నిస్తేజస్కునిగా జేయుడు.”
“ఓ విషశక్తీ! నీవు ఈ భయంకర సౌందర్య నారీరత్నమునందు
సంపూర్ణవేగముతో కూడుదువుగాక
ఓ కాలకూటవిషమా! నీవు లోకాలను దహింతువు. నీ దహనశక్తి మా
శత్రువును దహించివేయుగాక
ఓ దంష్ట్రాకరాళ మృత్యుమూర్తీ! నీ వీ బాలికయందు ప్రవేశింపుము.

అడివి బాపిరాజు రచనలు - 2

• 63 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)