తనకు పూజామూర్తిగా దినదినాభివృద్ధిగ చంద్రికామృత తేజస్సున విలసిల్లిపోవుచు, ప్రియుని హృదయాన చేరు శుభముహూర్త మెప్పుడని ఎదురు చూచుచున్నది.
***
పాటలీపుత్రమును పాలింపుచు సువర్ణశ్రీ కోశలదేశమున స్థూపమున కొన గోపురము స్వయముగ విన్యసించి యర్పించెను.
సువర్ణశ్రీ హిమబిందులప్రేమ మహాకావ్యముల కవులచే పాడబడినది.
హిమబిందు సువర్ణశ్రీల ప్రేమ అతిలోకసుందరమై మహాద్భుత శిల్పవిన్యాసరూపమై ఆర్యావర్తమంతయు విలసిల్లిపోయినది. సువర్ణశ్రీ శిష్యులు గాంధార, పారశీక, కొహరస్థాన, బాహ్లిక, మంగోలు, కాశ్యప సముద్రదేశాదులు పోయి ఆంధ్రశిల్ప చిత్రలేఖనాదులు వికసింపజేయు యత్నమున నుండిరి.
శిల్పదీక్ష ఎంత ప్రతిభాయుక్తమైయున్నదో సువర్ణశ్రీకి రాజ్యపాలనాదక్షతయు నంతపట్టుబడినది. ముక్తావళీదేవియు, కీర్తిగుప్తులవారును పాటలీపుత్రముననే ఆగిపోయిరి. చారుగుప్తవణిక్సార్వభౌముడు హిమబిందు ఆనందములో తాను మహానంద మనుభవించుచు, ఆంధ్రమహా సామ్రాజ్యమును వేయికన్నుల కాపాడుచు, పాటలీపుత్ర, ధాన్యకటకనగరములమధ్య తిరుగుచుండెను.
హిమబిందు సౌందర్యము సంపూర్ణవికాస మందినది. ఆమెయే యరణము నిచ్చి బాలనాగిని హర్షగోపునకును వివాహముచేయించి, హర్ష గోపునకు పాటలీపుత్ర పురమున ఉద్యోగమిప్పించినది.
హిమబిందు మహత్సౌందర్యమును అణువు పూజింపుచు సువర్ణశ్రీ దివ్యపథముల సంచరించుచున్నట్లు జీవితాన్వేషియైనాడు. హిమబిందు వెన్నెల, సువర్ణశ్రీ శశికళా ప్రియంభావుకుడు.
హిమబిందు: ఆత్మేశ్వరా! ఏమట్లు మీరు అత్యంత తీవ్రాలోచనా ధీనులైయున్నారు?
సువర్ణశ్రీ: జీవితేశ్వరీ! నాకీ రాజ్యభారము వహించుట ఎందుకు? ఏదియో శిల్పము చేసుకొనువానికి.
హిమ: పాటలీపుత్రపురమును జయించి చక్రవర్తికి స్వాధీనము చేయునాడు మీ కా ఆలోచనలేదూ?
సువర్ణ: ఆపని చక్రవర్తికై చేసితిని.
హిమ: | “ఇదియు చక్రవర్తికై కదా? | |
“ప్రభూ! అశోకుడు శిల్పరసజ్ఞు డగు చక్రవర్తి, మరి నా ప్రభువు శిల్పి చక్రవర్తి! శిల్పియే చక్రవర్తి ప్రతినిధి!”
ఆమె ఆతని హృదయమున వ్రాలినది.
సువర్ణు డామెను బిగియార కౌగిలించుకొనెను. వారిరువురి మోములు శశికళాపరమ శోభాయుతములై పోయినవి.
అడివి బాపిరాజు రచనలు - 2
• 295 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)