పుట:Himabindu by Adivi Bapiraju.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జరుగుచుండును. ఒకచో మల్లయుద్ధ మొనర్చుచుందురు. ఒకచో రథములు పందెముల కొరకై పరుగెత్తించెదరు. ఒకచో ధనుర్విద్య నేర్చుకొనుచుందురు. వేరొకచో గుఱ్ఱపు స్వారియుందు నిమగ్నులయియుందురు. పలువురు మల్ల ముష్టి యుద్ధాల నలవరచుకొను చుందురు. మహావీరులకు ఉనికిపట్టయిన ఆ ప్రదేశమునకు చిక్కిపోయిన బక్కవారిని రానీయరు. అచటికి వెళ్ళలేనందుకు పలువురు ఆంధ్రబాలురు ప్రాణ త్యాగమునకైన ఆయత్తులగుదురట.

మహోత్సవములప్పు డచ్చట ప్రదర్శనములు, పందెములు జరుగుచుండును. ఆంధ్ర సార్వభౌముడు శ్రీముఖుని పుట్టినదినమున ప్రతిసంవత్సరమును మహోత్సవాల నేకము లందు జరుగును.

నగరమధ్యము, సార్వభౌముని కోటకు సుమారు రెండు నూర్లధనువుల దూరమున, నగర క్రీడామందిర మున్నది. క్రీడామందిరమును చుట్టి నగర వసంతోద్యానమున్నది. వసంతోద్యానకుడ్యములనాని చిన్నక్రీడా పర్వతమున్నది.

నగరనర్తశాల యా క్రీడా పర్వత శిఖరముపై నున్నది. పర్వత పాదము నుండి ఆ చిన్ననగరము అరువది అడుగుల ఎత్తు మాత్రము. నర్తనశాలలో సార్వభౌమ జన్మదినోత్సవ సంగీత సభలు, నాట్యప్రదర్శనములు జరుగును. కోటలో నున్న రాజనర్తనశాలకు, ఆనందమందిరమని పేరు. అచ్చట ముఖ్య నాట్యప్రదర్శనములు జరుగును.

ఉత్తమగాయకులకు, నటకులకు, కవులకు, శిల్పులకు, చిత్రకారులకు భూరి పారితోషకముల సార్వభౌము డర్పించును. దేశమంతయు సంతోషమున నోలలాడును. గ్రామములు, ఘంటా పథములు, పట్టణములు, నగరములు అలంకరింప బడును. కారాగృహముల బంధితుల విడుదల చేతురు. పల్లెల, పురముల నృత్య గానకావ్యాది వినోదములు ఎడతెగక జరుగును.

విస్తారాంధ్రమహారాజ్యమందెచ్చటను, ఏవిధమగు పన్నులను నెలరోజులవరకు వసూలు చేయరు. దేశమంతయు నానందడోలికల తేలియాడి పోవుచుండును.

ఖేలనాస్థలములలో ముష్టియుద్ధ, మల్లయుద్ధ, ఖడ్గయుద్ధాది ప్రదర్శనములు, గుఱ్ఱపు పందెములు, రథముల పందెములు, ఏనుగు పందెములు జరుగును. వీధినాటకములు, తోలుబొమ్మల నాటకములు, దొమ్మరవిద్దెలు, సాముగరిడీలు, గాథాకాలక్షేపములు ఎన్నియేని జరుగును. జనులు ఆనంద పరవశులై, శుభ్ర వస్త్రములు ధరించి, భూషణాలంకృతులై, మద్యాదికములు త్రాగువారును, జూదముల పాల్గొనువారును, ఆఖేటనోత్సాహులు నగదురు. ఆంధ్రసుందరీమణులు అప్సరసలే యై నృత్యగీతాదుల వినోదించుచు, ప్రదర్శనముల పాల్గొనుచు, సర్వభూషణాలంకృతులై ఒయారపు నడకల ఏ గంధర్వ నగరమునో తలంపునకు దెత్తురు.

ఆంధ్రులకు ఎడ్లబండి పందెములు (ఈవలావల ఎడ్లు, మధ్య గుఱమును కట్టిన బండ్లపందెములు), రథ పరీక్షలు అత్యంత ప్రీతికరములు. ఈ పందెముల పాల్గొనని ఉత్తమాంధ్రు డాయుగమున ఆంధ్ర మహాసామ్రాజ్యమునం దెచ్చటను గానరాడు.

ఈ వివిధోత్సవములలో నానందించుటకు, వివిధపరీక్షల పాల్గొని బహుమతు లందుటకు ఆసేతుహిమాచలముననున్న దేశములందలి మహారాజుల, మండలాధిపతుల, సామంతుల, చక్రవర్తుల, అర్హతుల, కులపతుల, మహాభిక్షుకుల, ఋషుల, పండితుల, కవుల, గాయకుల, నటుల, వీరుల, పోటుమగల నాహ్వానింతురు.

అడివి బాపిరాజు రచనలు - 2

• 20 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)